భారత్తో యుద్ధమే, జిహాదీ వల్లే బ్రెగ్జిట్: హఫీజ్ సయీద్
లాహోర్: పాకిస్థానీ నదుల విముక్తికి భారత్పై జిహాద్ (యుద్ధం) చేస్తామని లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ ప్రకటించారు. ముంబై ఉగ్రదాడుల వెనుక ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న సయీద్ తలకు అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, పంజాబ్ ప్రావిన్స్లోని సియాల్కోట్ జిల్లాలో జడ్ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కాశ్మీరీల స్వాతంత్య్ర ఉద్యమం రోజురోజుకూ ఊపందుకుంటున్నదని చెప్పారు. భారత్ నుంచి పాకిస్థాన్ నదులకు విముక్తి కల్పించేందుకు ఆ దేశంపై యుద్ధం చేస్తామని అన్నారు.
కాశ్మీర్లోని దుఖ్త్రాన్ ఎ మిలత్ నాయకురాలు ఆసియా అంద్రబీ తనకు ఫోన్ చేసి, కాశ్మీర్లో పరిస్థితి మారిందని చెప్పారని తెలిపారు. స్వతంత్ర కాశ్మీర్ గురించి మాట్లాడే వారెవరూ ఇప్పుడు తెరపై కనిపించడం లేదని, యువ నాయకత్వం ముందుకు వచ్చిందని, వారే స్వాత్రంత్యోద్యమానికి కొత్త ప్రేరణనిస్తారని చెప్పారు.
పాకిస్థాన్కు వ్యతిరేకంగా అమెరికా తన దుష్ట ముసుగును తొలగించిందని, దాని హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలని సయీద్ పాక్ నాయకత్వానికి సూచించారు. అంతేగాక, ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంపైనా సయీద్ స్పందించాడు. జిహాదీ కారణంగా బ్రెగ్జిట్ జరిగిందని అన్నాడు. దేవుడి ఆగ్రహం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపాడు.