గంటకు 603 కిమీ వేగంతో రికార్డ్: వేగవంత జపాన్ రైలు, ప్రత్యేకతలు
టోక్యో: జపాన్ మ్యాగ్ లెవ్ రైలు కొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించింది. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించింది. మౌంట్ ఫ్యూజి వద్ద మంగళవారం దీనిని ప్రయోగాత్మకంగా నడిపారు. అప్పుడు ఇది అంత వేగంతో నడిచింది. దీనికి ఏడు బోగీలు ఉన్నాయి.
మ్యాగ్ లెవ్ రైలు గరిష్ట స్థాయిలో గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని జపాన్ రైల్వే సంస్థ పేర్కొంది. దాదాపు పదకొండు సెకన్ల పాటు ఈ వేగంతో వెళ్లిందని చెప్పారు. పన్నెండేళ్ల క్రితం వీరే 581 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలును తెచ్చారు.
కొద్ది రోజుల క్రితం 590 కిలోమీటర్ల వేగంతో ఆ రికార్డును బద్దలు కొట్టింది. కాగా, ఇది వరకు బుల్లెట్ రైలు వేగం గురించి మాట్లాడుకునే వాళ్లం. ఇప్పుడు మ్యాగ్ లెవ్ రైలు బుల్లెట్ రైలును మించి వేగంతో ప్రయాణిస్తుంది.
ఇదీ దీని ప్రత్యేకత!
ఈ మ్యాగ్ లెవ్ (మాగ్నెటిక్ లెవిటేషన్) రైలు పట్టాలపై పరుగెత్తుతుంది, కానీ పట్టాలకు ఆనదు. రైలుకు, పట్టాలకు మధ్య 10 సెంటీమీటర్ల ఖాళీ ఉంటుంది. మాగ్నెటిక్ లెవిటేషన్ ఇది ఆధారంగా గాలిలో దూసుకెళ్తుంది. విద్యుత్తో ఛార్జీ అయ్యే అయస్కాంతాల సాయంతో నడుస్తుంది. ఈ రైలు వేగాన్ని పుంజుకునే కొద్దీ గురుత్వాకర్షణ శక్తి బలం పెరుగుతున్న భావన ప్రయాణీకులకు కలుగుతుంది. దీంతో వీరికి విమానంలో టేకాఫ్ అవుతున్నట్లుగా అనిపిస్తిందు.
సెంట్రల్ జపాన్ రైల్వేస్ ఈ మాగ్లెవ్ ప్రాజెక్టు మీద 1967 నుంచి అధ్యయనం చేస్తోంది. ఈ రైలు 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలియగానే జపాన్వాసులు సంబరపడిపోయారు. ఈ ప్రాజెక్టును 2027కల్లా పూర్తి చేయాలని జపాన్ రైల్వేస్ తలపెట్టింది.
టోక్యో - నగోయా నగరాల మధ్య నిర్మిస్తున్న మార్గంలో 286 కిలో మీటర్ల గమ్యాన్ని కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. 2045నాటికి మ్యాగ్ లెవ్ రైళ్లను ఒకాసాల మధ్య నడపాలని భావిస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం సగానికి తగ్గి 1.07 గంటల్లోనే ముగుస్తుంది.
ఖర్చు చాలా ఎక్కువ
మ్యాగ్ లెవ్ రైళ్లకు భారీ ఖర్చు అవుతుంది. టోక్యో నుండి నగోయాకు 10వేల కోట్ల డాలర్లు ఖర్చవుతాయని అంచనా. ఇందులో చాలా ఎక్కువ శాతం ఖరీదైన సొరంగాల గుండా సాగుతుంది. తమ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేయాలని జపాన్ భావిస్తోంది.