పవన్ కల్యాణ్: ఇక కర్నూలులో కౌలు రైతు భరోసా యాత్ర.. ఎప్పటి నుంచి అంటే..?
జనసేనాని పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సాయం అందించారు. ఈ నెల 8వ తేదీన కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఉదయం 9.30 గంటలకు పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా చేరుకుంటారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
జిల్లాలో గల శిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని నాదెండ్ల తెలిపారు. తొలివిడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 కౌలు రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం అందిస్తారు. మిగిలినవారికి రెండో విడతలో సాయం అందించనున్నట్టు పేర్కొన్నారు.

రైతు లేకుంటే జీవితం లేదు. అందరికీ అన్నం పెట్టే రైతులు ఇప్పుడు బలవన్మరణం పాలవుతున్నారు. జనం కష్టాల నుంచి ఓట్లు ఎలా పొందాలో ఆలోచించే వ్యక్తిని కాదు. వారికి ఏం చేయగలనో ఆలోచిస్తానని జనసేన అధినేత పవన్ ఇవివరకే పేర్కొన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోనే 353 మంది చనిపోయారని... అనంతపురం జిల్లాలో 170 మంది, ఉభయ గోదావరి జిల్లాల్లో 81 మంది మరణించారని చెప్పారు.
రైతుకు కులం లేదు. వారికి అండగా నిలవాలని పవన్ పేర్కొన్నారు. డబ్బు ఎంతిచ్చినా సరిపోదని తెలుసు. ఇచ్చే లక్షతో అద్భుతాలు జరగవనీ తెలుసు. తన వంతుగా ఏదో చేయాలనుకున్నాను. ఒక్క కన్నీటి చుక్క తుడిసినా... జన్మ ధన్యమవుతుందని పవన్ తెలిపారు.
కౌలు రైతులను అదుకునేందుకు పవన్ కల్యాణ్ రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ చెక్ను పార్టీ కోశాధికారి ఎం.వి.రత్నంకు ఆయన అందించారు. పవన్తోపాటు ఆయన సోదరుడు నాగబాబు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. వీరితోపాటు మరికొంత మంది నాయకులు లక్షల్లో విరాళాలను ప్రకటించి కౌలు రైతులకు అండగా నిలిచారు.












Click it and Unblock the Notifications