బీజేపీ, టీఆర్ఎస్ దొందూ దొందే: వైఎస్ షర్మిల
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకేతాను ముక్కలు. ఇరు పార్టీలు భారీగా రేట్లు పెంచి ప్రజల రక్తం పీలుస్తున్నయని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రంలోని బీజేపీ పెట్రోల్, గ్యాస్, నూనె రేట్లు పెంచితే.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ కరెంట్, రిజిస్ట్రేషన్, ఆర్టీసీ, మున్సిపల్, నల్లా చార్జీలు పెంచి భారం మోపుతోందన్నారు. ప్రజాప్రస్థానంలో వైయస్ షర్మిల 38వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా తిరుమలగిరి పట్టణంలో పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం మాలిపురం, బండ్లపల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. అనంతరం వెలిశాల గ్రామంలో మాట-ముచ్చట నిర్వహించారు.
కేసీఆర్కు రెండు సార్లు అధికారం ఇస్తే అన్ని వర్గాలను మోసం చేశారు. ఏడేండ్లుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశాడు. కేసీఆర్ నాలుగు లక్షల అప్పులు చేసినా.. ఫీజు రీయింబర్స్ మెంట్కు నిధులు ఉండవు. ఆరోగ్యశ్రీకి నిధులు ఉండవు. రుణమాఫీ ఉండదు. మహిళా సంఘాల రుణాలకు వడ్డీలు చెల్లిద్దామన్నా నిధులు ఉండవు. నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి, రూపాయి లేదంటున్నాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినిట్లు ప్రజలను తాకట్టుపెట్టి అప్పులు తెచ్చి, ఆ అప్పులను మళ్లీ ప్రజలపైనే రుద్దుతున్నాడు. కేసీఆర్ ను నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దు. ఎన్నికల సమయంలో ఎన్నో దొంగ హామీలు ఇస్తాడు. ఎన్నో గారడి మాటలు చెబుతాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దన్నారు.
వైయస్ఆర్ ఐదేండ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసి, అద్భుత పాలన అందించారు. మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. వైయస్ఆర్ పాలనలో నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. ప్రైవేటు రంగంలోనూ 11 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించి, స్వయం ఉపాధికి తోడ్పాటు అందించారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ అందించారు. పేదింటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి, ఉన్నత చదువులు చదివించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించారు. 46లక్షల మందికి పక్కా ఇండ్లు నిర్మించి, రికార్డు సృష్టించారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఆదుకున్నారు. ఐదేండ్లలో ఒక్క పన్ను కూడా పెంచలేదన్నారు.