కోచ్ దరఖాస్తుపై పెదవి విప్పిన సెహ్వాగ్
రెండు రోజుల క్రితం సెహ్వాగ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో భారత జట్టు చీఫ్ కోచ్ పదవికి తాను ఎందుకు ఎంపిక కాలేదో వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేయాలన్న ఆలోచన తనకు అసల్లేదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. బీసీసీఐ ఉన్నత వర్గాలు తనతో సంప్రందించాకే తాను దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.
పెద్దలను తాను మేనేజ్ చేయలేకపోయా
'బీసీసీఐలో కీలక నిర్ణయాలు తీసుకునే పెద్దలను తాను మేనేజ్ చేయలేకపోయానన్నాడు. భవిష్యత్లో మరోసారి కోచ్ పదవికి దరఖాస్తు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. బోర్డుతో నాకు సరైన సెట్టింగ్ లేదు. కోచ్ను ఎంపిక చేసే పెద్దలతో మంచి సంబంధాలు నెరపలేకపోయా. మొత్తంగా అందరిని మేనేజ్ చేయడంలో నేను వెనుకబడిపోయా. కోచ్ పదవికి దరఖాస్తు చేసే విషయంలో బీసీసీఐలోని ఓ వర్గం నన్ను తప్పుదోవ పట్టించింది. కోచ్ కావాలని నేను కోరుకోలేదు. వాళ్లే ఆఫర్ ఇచ్చారు' అని సెహ్వాగ్ తెలిపాడు.
బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి వచ్చి సంప్రదింపులు
'బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదురి, జీఎమ్ శ్రీధర్ వచ్చి ఆఫర్ గురించి ఆలోచించమని చెప్పారు. కాస్త సమయం తీసుకొని దరఖాస్తు చేశా. అప్పటి వరకు నాకు ఎలాంటి ఆలోచన లేదు. ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీ నన్ను దరఖాస్తు చేసుకోమని సలహా ఇచ్చాడు. వీటన్నింటి వల్లే నేను కోచ్ పదవికి దరఖాస్తు చేయాల్సి వచ్చింది' అని సెహ్వాగ్ అన్నాడు.
చేసిన తప్పు మళ్లీ చేస్తానా? అని రవిశాస్త్రి అన్నాడు
ఇంగ్లాండ్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే సమయంలో కామెంటేటర్ బాధ్యతలు నిర్వహించేందుకు వచ్చిన రవిశాస్త్రిని కోచ్ పదవికి దరఖాస్తు చేస్తున్నావా అని అడిగాను. అలాంటిదేమీ లేదు. చేసిన తప్పు మళ్లీ చేస్తానా అని సమాధానమిచ్చాడు. శాస్త్రి ఉద్దేశం తెలిసిపోయింది కాబట్టి మనకు ఇబ్బంది లేదని అనుకున్నా. ఒకవేళ రవిశాస్త్రి బరిలో ఉంటే నేను దరిదాపుల్లోకి కూడా రాకపోయేవాణ్ని. మళ్లీ కోచ్ పదవి దగ్గరకు కూడా వెళ్లను' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.