బాంబు తిన్న గేదె: 500మీటర్ల దూరంలో తల ఎగిరిపడింది
నగరంలోని మియాపూర్లో డంపింగ్ యార్డులో సోమవారం భారీ పేలుడు సంభవించింది. చెత్తకుప్పలోని పేలుడు పదార్ధాన్ని ఓ గేదె నమలడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: నగరంలోని మియాపూర్లో డంపింగ్ యార్డులో సోమవారం భారీ పేలుడు సంభవించింది. చెత్తకుప్పలోని పేలుడు పదార్ధాన్ని ఓ గేదె నమలడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ పేలుడు దాటికి గేదె శరీరం ఛిద్రమైంది. గేదె తల 500 మీటర్ల దూరంలో ఎగిరిపడటం గమానర్హం. పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పేలుడు శబ్దం దాదాపుగా రెండు కిలోమీటర్ల వరకు వినిపించిందని వారు చెప్పారు. ఇలాంటి ఘటన ఇప్పటి వరకు ఇక్కడ జరగలేదని స్థానికులు చెబుతున్నారు. కాగా, విషయం తెలుసుకున్న వెంటనే మియాపూర్ సీఐ హరిశ్చంద్రారెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు.
బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి. ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలున్నాయా? అసలు పేలుడు పదార్థం ఇక్కడికి ఎలా చేరింది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.