ఎంపీడీఓ ఇంటిపై ఏసీబీ దాడులు: రూ. 2.5కోట్ల ఆస్తుల గుర్తింపు
ఎంపీడీఓ ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు రూ. 2.5 ఆక్రమాస్తులను గుర్తించారు.
వరంగల్: బుధవారం ఉదయం ఆరు గంటలు.. హంటర్రోడ్డులోని శ్రీరామారావు కాలనీ.. రయ్ రయ్మంటూ ద్విచక్ర వాహనాలు వచ్చి ఓ ఇంటి ముందు ఆగాయి.. వచ్చిన వారు తలుపు తట్టారు.. యజమాని సీసీ కెమెరాలను పరిశీలించి వచ్చిందెవరో తెలుసుకొని తీయలేదు.. సుమారు గంట సేపు బయటే నిల్చొన్నారు.. చేసేదిలేక ఇంటి వెనుక నుంచి వెళ్లారు. కిటికీలో నుంచి యజమానిని పిలిచి తలుపు తీయాలని గట్టిగా మందలించారు. అప్పుడు అతను ద్వారం తెరిచాడు.
అనంతరం తమ పని తాము చేసుకున్నారు. ఇంతకీ వచ్చిన వారెవరో చెప్పలేనే లేదు కదూ.. వారు ఏసీబీ అధికారులు. తలుపు తీసింది ఎంపీడీవో. ఈ ఘటన బుధవారం సంచలనం రేకెత్తించింది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. మిట్టకోల చంద్రమౌళి ఎంపీడీవోగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాడు.
గతంలో పనికి ఆహార పథకం, వృద్ధాప్య పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడడంతో విధుల నుంచి తప్పించారు. తర్వాత ఖానాపురంలో పనిచేస్తున్న సమయంలో అప్పటి జ డ్పీ సీఈవో విజయ్గోపాల్పై ఎదురుతిరగడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.

కీలక పత్రాల స్వాధీనం..:
చంద్రమౌళి నివాసంలో అధికారులు వేకువజాము నుంచే తనిఖీలు చేశారు. శ్రీరామారావుకాలనీ (ప్రస్తుతం ఉంటోంది), హైదరాబాద్లోని బండ్ల్లగూడలో ఇళ్లు, హన్మకొండ రెవెన్యూ కాలనీలో 1000 గజాలు, రాష్ట్ర రాజధాని సమీపంలోని అబ్దుల్లాపూర్మెట్లో 300 గజాలు, బీబీనగర్ మండలం నెమిరిగొండలో 500 గజాలు, ఘట్కేసర్ వద్ద 267, 275 గజాలు, హన్మకొండ మండలం కొండపర్తిలో 33 గుంటలు, ఇదే ప్రాంతంలో 1.20 ఎకరాలు ఉన్నట్లు వెల్లడైంది.
చంద్రమౌళి అత్తామామ పేరుతో హైదరాబాద్ సమీపంలోని హయత్నగర్లో 2000 గజాలు, హన్మకొండ న్యూశాయంపేట రోడ్డులో 421, 410 గజాలు, గీసుగొండ మండలం వసంతపూర్లో 1.15 ఎకరాలు, 10 గుంటలు, 24 గుంటలు వేర్వేరుగా ఉన్నట్లుగా తేలింది. ఇంట్లో రూ. ఐదు లక్షల విలువైన బంగారు నగలు, కారు, మోటారు సైకిల్ ఉన్నాయి.
హైదరాబాద్లోని బండ్లగూడ, ఖమ్మం, తొర్రూరులోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మంలో స్నేహితుడి పేరుతో కొన్ని ఆస్తులు ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం రూ. 2.5 కోట్ల అక్రమ అస్తులు ఉన్నట్లు గుర్తించారు. గురువారం బ్యాంకు అకౌంట్లు, ఇతర ఆస్తులపై విచారణ చేయనున్నారు. అనంతరం మరికొన్ని ఆస్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది. చంద్రమౌళిని అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.












Click it and Unblock the Notifications