9లక్షల రూ.2వేల నోట్లు సీజ్: ఏపీకి చెందిన ముగ్గురి అరెస్ట్
23శాతం కమీషన్తో పెద్ద నోట్లను మార్పిడి చేసిన ఏపీలోని నెల్లూరుకు చెందిన ముగ్గురు నిందితులను మాదాపూర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: 23శాతం కమీషన్తో పెద్ద నోట్లను మార్పిడి చేసిన ఏపీలోని నెల్లూరుకు చెందిన ముగ్గురు నిందితులను మాదాపూర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 9లక్షలు విలువ చేసే రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీహెచ్ అశోక్, సయ్యద్ షానవాజ్, ఎండీ మస్తాన్లు రూ. 2వేల నోట్లుగా రద్దైన నోట్లను మారుస్తామంటూ నగరంలోని ఓ హోటల్లో పని చేసే ప్రవీణ్ అనే వ్యక్తిని కలిశారు. 23శాతం కమీషన్ తీసుకుని ఆ మొత్తాన్ని మాదాపూర్లోని మరో ఇద్దరికి అందజేశారు.
కాగా, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నఆ ఇద్దరినీ పోలీసులు తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న డబ్బుకు సరైన సమాధానం చెప్పకపోడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
తాము నెల్లూరు నుంచి నోట్లను మార్చుకునేందుకు ఇక్కడి వచ్చామని చెప్పారు. అయితే, ఎవరి తరపున నోట్లను మార్చారు, ఎవరు నోట్ల మార్పిడికి సహకరించారనే విషయాలు మాత్రం బయటపెట్టలేదు. కాగా, ఈ ముగ్గురు కూడా నెల్లూరులోని బ్యాంకు అధికారులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిసింది.
ఈ ముగ్గురితోపాటు వారి వద్ద నుంచి డబ్బు తీసుకున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ను అరెస్ట్ చేశామని, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులను అప్రమత్తం చేశామని, వారిచ్చే సమాచారంతో తాము దర్యాప్తు చేపడతామని మాదాపూర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.