ఆ భయంతోనే కేంద్రంపై కేసీఆర్ నెపం: అవమానిస్తే ఊరుకున్నారా? అంటూ బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం, కేంద్రమంత్రులపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ ప్రజలను నూకలు తినమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారంటూ టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు.
ఆ భయంతోనే కేంద్రంపై కేసీఆర్ నెపం: బండి సంజయ్
ధాన్యం సేకరించని సీఎం కేసీఆర్కు ఓట్లు, సీట్లు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనే హక్కు లేదని బండి సంజయ్ అన్నారు. సమస్య పరిష్కారం కావాలో కొట్లాట కావాలో కేసీఆర్ చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి పియూష్ గోయాల్ అవమానిస్తే.. రోషం, పౌరుషం లేకుండా మంత్రులు ఎందుకు ఊరుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు తరిమికొడతారన్న భయంతో నెపాన్ని కేసీఆర్ కేంద్రంపై వేస్తున్నారని విమర్శించారు.ఇతర రాష్ట్రాలో లేని ధాన్యం సమస్య.. తెలంగాణలో మాత్రమే ఎందుకు సృష్టిస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.
విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై దృష్టి మళ్లించేందుకే ఢిల్లీ పర్యటన
విద్యుత్ ఛార్జీల పెంపును పక్కదారి పట్టించేందుకే.. మంత్రుల ఢిల్లీ పర్యటన అని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఏం జరిగిందో అందరకీ తెలుసని అన్నారు బండి సంజయ్. ఫాంహౌస్లో వరి పండిస్తున్నారో.. గంజాయి పండిస్తున్నారో కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫాంహౌస్లో పండిస్తోన్న వరి ఎక్కడ అమ్ముతారని నిలదీశారు. 'కొనుగోలు కేంద్రాలను ఎత్తేసే హక్కు ముఖ్యమంత్రికి లేదు. మంత్రులు, టీఆర్ఎస్ నేతల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ము కేసీఆర్కు ఉందా? అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి కేంద్రం నిధులు దోచుకుంటున్నారు. తాను చేసిన పొరపాటును ఒప్పుకుని కేసీఆర్ కేంద్రంతో మాట్లాడాలి. ఏడేళ్లుగా లేని సమస్యను కేసీఆర్ సృష్టిస్తున్నారు.
అందులో కేసీఆరే నెంబర్ వన్: బండి సంజయ్ ఫైర్
తెలంగాణ రైతుల ఇబ్బందులకు కారణం కేసీఆర్ నియంతృత్వమేనని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ఢిల్లీకి పోతానని.. తర్వాత ఎందుకు పోలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ నెంబర్ వన్ అని.. ఈ ముఖ్యమంత్రికి కావాల్సింది సెంటిమెంట్ రాజకీయమే అన్నారు. కలెక్టర్లు.. సర్పంచ్ లకు ఫోన్లు చేసి బెదిరిస్తోంది నిజం కాదా అని నిలదీశారు. సర్పంచ్లతో తీర్మానాలు చేయించే అధికారం కలెక్టర్లకు లేదని బండి సంజయ్ అన్నారు. ఫ్రభుత్వాలు శాశ్వతం కాదని.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని కలెక్టర్లు గుర్తించుకోవాలని హితవు పలికారు. సింగరేణి గురించి మాట్లాడే అర్హత కేసీఆర్, టీఆర్ఎస్కు లేదన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ అవాస్తవమని బండి సంజయ్ అన్నారు.