బిటెక్ డ్రాపౌట్: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతులకు గాలం
హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగా లిప్పిస్తానని యువతులకు గాలం వేసి మోసం చేస్తున్న ఓ బిటెక్ విద్యార్థిని రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
కరీంనగర్కు చెందిన రేవల్లి స్వరాజ్ బీటెక్ డిగ్రీ చదువుతూ మధ్యలో ఆపేశాడు. పేట్బషీరాబాద్ సుచిత్ర సర్కిల్లో ఎలక్ట్రానిక్ బిజినెస్ చేస్తుండేవాడు. జల్సాలకు అలవాటుపడిన అతడు సులభంగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అమీర్పేట మైత్రివనంలో కంప్యూటర్ కోర్సుల్లో గతంలో శిక్షణ తీసుకున్నాడు.
అక్కడ ఉద్యోగ వేటలో ఉండే యువతులను సులభంగా మోసం చేయవచ్చని భావించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకునే యువతులకు ఉద్యోగం ఇప్పిస్తానని పరిచయం చేసుకునేవాడు. తన సోదరి ఐటీ కంపెనీలో హెచ్ఆర్ మెనేజర్గా పనిచేస్తుందని, ఆమె ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతులను రాత్రి 10 గంటలకు ఆటోలో ఘట్కేసర్ మండంలంలోగల పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్కు తీసుకెళ్లేవాడు. అక్కడికెళ్లిన తర్వాత బెదిరించి నగలు, సెల్ఫోన్లు లాక్కునేవాడు.
గురువారం సాయంత్రం ఓ యువతిని ఆటోలో తీసుకెళుతుండగా కానిస్టేబుళ్లు రవికాంతరెడ్డి, సంతోష్ కుమార్ వెంబడించారు. వారిని చూసిన స్వరాజ్ పారిపోవటానికి ప్రయత్నించాడు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై ఘట్కేసర్లో - 6, దుండిగల్ పోలీస్స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు.
హైదరాబాదులోని గచ్చిబౌలిలో కూడా ఇతడి బాధితులు ఉన్నారన్నారు. బాధితులు డయల్ 100కు ఫోన్ ద్వారా కమిషనరేట్ వాట్సప్ నెంబర్ 9490617111కు ఫిర్యాదు చేయాలని కోరారు.