మొండిచెయ్యి కాదు తెలంగాణకు కేంద్రం ఉత్త చెయ్యి..
మొండిచెయ్యి చూపడంలో రెండు తెలుగు రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తోంది మోడీ సర్కార్. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి మొండిచేయి చేపిన కేంద్రం, తెలంగాణకు సంబంధించిన హామీల విషయంలోను అదే ధోరణితో వ్యవహరిస్తోంది. కేంద్రం దీనిపై అధికార ప్రకటన కూడా చేయడంతో తెలంగాణకు అన్యాయం జరిగినట్టేనన్న వాదన వినిపిస్తోంది.
విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఖమ్మంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా.. దీనిపై తాజాగా మాట మార్చిన ప్రభుత్వం ఆర్థిక కారణాల రీత్యా ఖమ్మంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని తెలంగాణకు షాక్ ఇచ్చింది. లిఖితపూర్వకంగా దీనిపై సమాధానం వెలువరించిన కేంద్రం తెలంగాణకు సంబంధించిన మరిన్ని విషయాల్లోను కోత పెట్టింది.
విభజన హామీల ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన వాటిల్లో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఒకటి. కానీ తాజా ప్రకటన ద్వారా తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ను కూడా హామీల నుంచి తప్పించే ప్రయత్నం చేసింది కేంద్రం. ట్రాఫిక్ డిమాండ్ ను సాకుగా చూపి దీనికి అనుకూలంగా ఉంటేనే రైలు ఏర్పాటు సాధ్యమవుతుందని కుండబద్దలు కొట్టింది. మొత్తానికి కేంద్రం తాజా ప్రకటన మొండిచేయిని కాదు, తెలంగాణ ఉత్త చెయ్యినే ఊపినట్టయిందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. మరి ఈ విషయంలో కేంద్రంపై తెలంగాణ ఎంపీలు ఏవిధంగా ఒత్తిడి తెస్తారో చూడాలి.