షాకింగ్ దోస్తీ: ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలు జతకట్టాయి!
వరంగల్/ఖమ్మం: గ్రేటర్ వరంగల్, ఖమ్మం జిల్లా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువు. అయితే విభజన నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కలుస్తూ.. షాకిస్తున్నాయి.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పాలమూరు జిల్లా అచ్చంపేట మునిసిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో ఈ సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార తెరాసకు ఎదురొడ్డి నిలిచే క్రమంలో అచ్చంపేటలో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి.
ఖమ్మం కార్పొరేషన్లో మాత్రం టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కొన్నిచోట్ల చేతులు కలిపాయి. రెండు డివిజన్లలో కాంగ్రెస్ తన అభ్యర్థులను బరిలోకి దింపకుండా టిడిపి అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. టిడిపి కూడా రెండు డివిజన్లలో తన అభ్యర్థులను దింపకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చింది.
కారెక్కిన పుల్లా పద్మావతి
టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్కు ప్రత్యర్థి పార్టీల నుంచి మరో నేత కారు ఎక్కారు. వరంగల్ జిల్లాలో తమకంటూ గుర్తింపు సాధించుకున్న మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, ఆమె భర్త పుల్లా భాస్కర్లు తెరాసలో చేరారు. వీరు... వైయస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం జగన్కు అండగా నిలిచారు.
కొండా మురళీ, కొండా సురేఖలతో వీరికి రాజకీయ వైరం ఉంది. ఈ నేపథ్యంలో వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కొండా దంపతులు కారు ఎక్కారు. ఇప్పుడు పుల్లా దంపతులు కూడా తెరాసలో చేరారు.