వాహ్!: రేవంత్ వర్సెస్ టీఆర్ఎస్ మైండ్ గేమ్.. పట్టు కోసం పాట్లు
హైదరాబాద్: టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, అధికార టీఆర్ఎస్ మధ్య వ్యూహాలు, ప్రతివ్యూహాలు 'మైండ్ గేమ్' ఆడుతున్నాయి. అటు 'హస్తిన'కు వెళ్లి స్నేహ 'హస్తం' అందుకునే లోపే అప్రమత్తమైన టీఆర్ఎస్ నాయకత్వం.. కొడంగల్ అసెంబ్లీ స్థాన పరిధిలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో సీనియర్లుగా, కీలక పాత్ర పోషిస్తున్న నేతలు, కార్యకర్తలను ఆకర్షించింది. మ్మెల్యే రేవంత్రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా విమర్శల తూటాలు పేలుస్తున్న రేవంత్ లక్ష్యంగా టీఆర్ఎస్ నాయకత్వం పలు వ్యూహాలను అమలు చేసింది. రేవంత్కు మద్దతుగా నిలిచిన నేతలందరినీ గులాబీ కండువా కప్పుకునేలా చేయడంలో టీఆర్ఎస్ విజయం సాధించింది.
గుర్నాథ్ అన్న కూతురు అనిత
అవకాశం కోసం ఎదురు చూస్తున్న రేవంత్.. కొడంగల్లో రాజకీయ భీష్ముడిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి కుటుంబంపై దృష్టి సారించారు. గురునాథ్రెడ్డి అన్న కూతురు అనురెడ్డి అలియాస్ అనిత స్వయంగా రేవంత్ను కలిసి మద్దతు ప్రకటించారు. దీంతో కథ అడ్డం తిరుగుతున్నదని నిర్ధారణకు వచ్చిన టీఆర్ఎస్ నాయకత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇలా ఇరు పక్షాలు ఒకరిపై మరొకరు ‘మైండ్ గేమ్' నిత్యక్రుత్యంగా మారింది.
పాలమూరుపై తెలంగాణ సర్కార్ ఫోకస్
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా పేరొందిన రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీఆర్ఎస్ అధిష్టానం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై దృష్టి సారించింది. జిల్లాలో సంస్థాగతంగా బలంగా ఉన్న కాంగ్రెస్లో రేవంత్ చేరడం ద్వారా ఆ పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావించి రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గమైన కొడంగల్లో ‘హస్తం' పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహం అమలు చేసింది. ఆయన అనుచరులు, పార్టీ ముఖ్యులందరినీ టీఆర్ఎస్లో చేర్చుకుంది. కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎన్నడూ లేని విధంగా రూ.కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. అలాగే వారంలో మూడు రోజుల పాటు వివిధ శాఖల మంత్రులు కొడంగల్ నియోజకవర్గ పరిధిలో బారులు తీరుతుండటంతో.. దీంతో నియోజకవర్గంలో రేవంత్ పట్టును తగ్గించి, తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేసింది.
గుర్నాథరెడ్డి గ్రూపును తన వైపుకు తిప్పుకునేందుకు రేవంత్ యత్నాలు
కొడంగల్ అసెంబ్లీ స్థానం పరిధిలో టీఆర్ఎస్ చేపట్టిన ‘ఆపరేషన్'తో రేవంత్ సహనం కోల్పోయినట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. తన నుంచి వెళ్లిపోయిన నేతలు, మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ రెడ్డి దూషణల పర్వం కొనసాగించారు. అంతేకాదు మంత్రి లక్ష్మారెడ్డి నియోజకవర్గమైన జడ్చర్లలో విస్తృతంగా పర్యటించారు. అయితే, లక్ష్మారెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వస్తుండటంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. ఏకంగా కొడంగల్ నియోజకవర్గంలో కురువృద్ధుడిగా పేరొందిన గురునాథ్రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి చీలిక తీసుకొచ్చారు. గురునాథ్రెడ్డి అన్న కూతురు స్వయంగా రేవంత్ను కలిసి మద్దతు ప్రకటించ డం ఇందులో భాగమేనని చెబుతున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గురునాథ్రెడ్డి.. ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి వెనక చేతులు కట్టుకుని తిరుగుతున్నారన్న ప్రచారానికి తెరతీయడం ద్వారా గురున్నాథరెడ్డి అభిమానులను తనవైపుకు తిప్పుకునే చర్యలు చేపట్టారు.
ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అభ్యంతరం లేదన్న గుర్నాథ రెడ్డి
కథ అడ్డం తిరుగుతుండటంతో టీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు గురునాథ్రెడ్డి నేరుగా టీఆర్ఎస్ను వీడేది లేదని బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. గడిచిన ఎన్నికల్లో నామినేషన్ వేసే చివరి రెండు రోజుల వరకు టికెట్ కోసం వేచిచూసిన తనను మోసం చేసిన కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదన్నారు. అలాగే, మీడియా ముందుకు వచ్చిన అనిత తనకు కూతురు వరుస అవుతుందని తెలిపారు. 50 ఏళ్ల క్రితం కుటుంబాలు విడిపోగా ఇప్పుడు తన కూతురునని చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం తగదన్నారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడిన రేవంత్రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్గాంధీ పార్టీలో చేర్చుకోవడం.. ఆ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. తన కుమారుడు ముద్దప్ప దేశ్ముఖ్ సర్పంచ్గా, ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారని, రాజకీయ భవిష్యత్ ఉన్న ఆయనకు టికెట్ ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశానని తెలిపారు. నరేందర్రెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుందని, ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు.
30 ఏళ్ల తర్వాత మాజీ పార్టీపై ఇలా విమర్శలు
ఇక్కడ ఒక ట్విస్ట్ కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు గుర్నాథ రెడ్డి. కానీ 1999, 2004 మినహా వరుసగా రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. తిరిగి 2014 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోతే వెంటనే ‘గులాబీ' తీర్థం పుచ్చుకుని టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన గుర్నాథ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీ తప్పుచేసిందని ఆరోపణలు గుప్పించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీ తన వద్దకు రాయబారం పంపిన మాట వాస్తవమేనని గుర్నాథ రెడ్డి అంగీకరించారు. ఆయనే 50 ఏళ్ల క్రితం తన కుటుంబ సభ్యులు విడిపోయారని, తర్వాత వరుసకు కూతురైన అనిత.. గుల్బర్గలో స్థిరపడ్డారని మీడియాకు చెప్పడం కొసమెరుపు.
2009లో రేవంత్ రెడ్డి చేతిలో గుర్నాథ రెడ్డి ఓటమి
నిజంగా చాలా కాలం క్రితమే విడిపోతే.. ఆ సంగతి ఇప్పుడు స్వయంగా గుర్నాథరెడ్డి బయటపెట్టాల్సిన అవసరమేమిటో తెలియడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 1978లో తొలిసారి ఇండిపెండెంట్గా గెలుపొందిన గుర్నాథ రెడ్డి తర్వాత తన రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి నుంచి 2014 ఎన్నికల ముందు వరకు అదే పార్టీలో గుర్నాథ రెడ్డి కొనసాగారు. కానీ గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తనను మోసగించిందని విమర్శలు చేయడమేమిటన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.