మోడీతో సెటిల్మెంట్ కోసమే ఢిల్లీకి కేసీఆర్: డీకే, ‘తొలి సీఎం’
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో లోపాయికారి ఒప్పందం చేసుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని డీకే అరుణ ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో లోపాయికారి ఒప్పందం చేసుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని డీకే అరుణ ఆరోపించారు.
శుక్రవారం డీకే అరుణ అసెంబ్లీ మీడియా హాలులో మీడియాతో మాట్లాడారు. తన వద్ద ఉన్న నల్లడబ్బును తెల్లధనంగా మార్చుకోవడం, సెటిల్మెంట్ చేసుకోవడమే కేసీఆర్ దిల్లీ ప్రయాణం అసలు ఉద్దేశమన్నారు.
నోట్ల రద్దు వెనక మోడీ రాజకీయ కుట్ర ఉందని, భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నోట్లు రద్దు చేశారని ఆరోపించారు. నోట్ల రద్దు దేశ వ్యాప్తంగా సామాన్యులను ఆందోళనకు గురి చేస్తోందని, రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.
మోడీ చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలిచిపోవాలన్న ఆలోచన, రాజకీయ స్వార్థంతో కొత్తనోట్లపై స్వచ్ఛభారత్ గుర్తును ముద్రించారని అన్నారు. నోట్ల రద్దు సాకుతో కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.
తొలి సీఎం కేసీఆరే: కర్నె
ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళుతున్నారని, దీనిని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టడం సిగ్గుచేటని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. నోట్ల రద్దుపై సమగ్రంగా సమీక్షించి, పర్యవసానాలను వెల్లడించిన తొలి సీఎం కేసీఆరేనని అన్నారు. కాంగ్రెస్ మాదిరిగా ద్వంద్వ విధానాలతో గాకుండా కేసీఆర్ కేంద్రానికి వాస్తవ పరిస్థితులను వివరిస్తారని కర్నె చెప్పారు.