చిక్కుల్లో టీఆర్ఎస్ ఎంపీ : నామా నివాసంలో ఈడీ సోదాలు : విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లింపు..!!
టీఆర్ఎస్ ఎంపీ చిక్కుల్లో పడ్డారు. టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ సోదాలు చేస్తోంది. హైదారాబాద్ లోని నివాసంతో పాటుగా కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తిరిగి కట్టకుండా విదేశాలకు నిధులు మళ్లించారనే అభియోగాలు నామా పైన ఉన్నాయి. మధుకాన్ సంస్థ పేరుతో బ్యాంకుల్లో ఆయన రుణాలు పొందారు. దాదాపుగా రూ 1,064 కోట్ల మేరు రుణాలు పొందిన ఆయన ఆ మొత్తాన్ని మళ్లించినట్లుగా ఈడీ అభియోగం మోపింది.
మధుకాన్ పై 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సీబీఐ ఛార్జ్ షీటు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. నామాతో పాటుగా కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. విదేశీ కంపెనీలను నిధులు మళ్లించటంతో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధుకాన్ కోసం పలు బ్యాంకుల కన్సార్షియంతో నిధులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయం వరకు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన నామా నాగేశ్వర రావు అనేక ప్రాజెక్టులు దక్కించుకున్నారు. టీడీపీ ఎంపీగానూ నామా వ్యవహరించారు. ఇక, ఖమ్మం నుండి గెలిచిన నామా ప్రస్తుతం లోక్ సభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ఈడీ అధికారులు అటు నివాసాల్లోనూ..ఇటు కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు నామా సంస్థల పైన ఈడీ విచారణ రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని పైన నామా నాగేశ్వర రావు స్పందించాల్సి ఉంది .గతంలో నమోదైన కేసులో భాగంగానే ఇప్పుడు ఈడీ సోదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ సోదాల గురించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వివరాలు వెల్లడించాల్సి ఉంది.