కొనుగోళ్ల సంస్కృతికి కేసీఆరే ఆధ్యుడంటూ ఈటల రాజేందర్ నిప్పులు: పార్టీల కనుమరుగంటూ ఫైర్
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య పరస్పరం మాటల దాడులు జరుగుతున్నాయి. తాజాగా, బీజేపీ ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు.

కొనుగోళ్ల సంస్కృతి తీసుకొచ్చిందంటూ కేసీఆర్: ఈటల
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుక్కుంటోందంటూ సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు ఈటల రాజేందర్. అసలు రాజకీయ నాయకులను కొనుగోలు చేసే సంస్కృతిని తీసుకువచ్చింది కేసీఆరేనని ఆయన విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగయ్యేలా చేసింది ఈ పెద్ద మనిషే అంటూ దుయ్యబట్టారు.

కేసీఆర్ ఆ పార్టీల కనుమరుగు చేశారన్న ఈటల
తెలంగాణ సాధించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను డబ్బులు పెట్టి కొన్నారని కేసీఆర్పై మండిపడ్డారు ఈటల. తెలంగాణలో 20 ఏళ్లు పాలించిన టీడీపీని కూడా కనుమరుగు చేసింది కేసీఆరేనని అన్నారు. కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ లు కలిస్తే ప్రజలను గోల్మాల్ చేస్తారని ముందుగానే అనుకున్నామని, అనుకున్నట్లే జరుగుతోందని ఈటల రాజేందర్ అన్నారు.

కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు సాగవన్న ఈటల
హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో కూడా తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర రాజకీయాలు చేశారని ఈటల గుర్తు చేశారు. అక్కడి ప్రజలకు మద్యం పోయించారని, దళిత బంధు పేరుతో ఒక్కో కుటుంబానికి 10 లక్షలు చొప్పున కొంత మందికి పంచారన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా హుజూరాబాద్ ప్రజలు ధర్మాన్నే గెలిపించారన్నారు ఈటల. ప్రజల కోసం పోరాడే సీపీఐ, సీపీఎం పార్టీల గొంతు నొక్కేశారని ఆరోపించారు. హుజూరాబాద్ లో చేసినట్లు.. ఇప్పుడు మనుగోడులో కూడా కుట్రలకు పాల్పడుతున్నారని ఈటల అన్నారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మునుగోడు ప్రజలు ధర్మంవైపు నిలబడి బీజేపీని గెలిపిస్తారని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

కేసీఆర్ అవినీతి, అహంకారానికి చెక్ పెట్టాలన్న వివేక్
మరోవైపు, కేసీఆర్ సర్కారుపై మునుగోడు ఉపఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులను తెరిచి గౌడన్నల పొట్టగొట్టారని మండిపడ్డారు. బీజేపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ లో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో వివేక్ మాట్లాడారు. రాష్ట్రంలోని గౌడన్నలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రమాదవశాత్తు ఎందరో గౌడ కార్మికులు తాటి చెట్లపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారని.. దీంతో చాలా మంది అంగవైకల్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ గౌడ కార్మికులకు ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. గౌడ కార్మికులకు మోపెడ్ లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ పాలనలో గౌడ కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని వివేక్ హామీ ఇచ్చారు. కేసీఆర్ అవినీతి, అహంకార పాలనకు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి విజయంతో చెక్ పెట్టాలని ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications