పోలీసుల భూదందా: బాధితుడిని బెదిరించి చెక్కులపై సంతకాలు, కేసు
హైదరాబాద్: భూసెటిల్మెంట్ వ్యవహరంలో బాధితుడిని నిర్భంధించి రూ.60 లక్షల చెక్కులపై బలవంతంగా సంతకాలు పెట్టించుకొన్న కేసులో రాచకొండ ఎఆర్ హెడ్క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ పులిందర్రెడ్డిపై కేసు నమోదైంది.
ఇందులో అతనికి సహకరించిన రాయదుర్గం ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ లక్ష్మీనారాయణలపై కేసులు నమోదయ్యాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులోని ముత్తంగి గ్రామంలో ఇరువురు రైతులకు ఎకరం భూమి ఉంది. దీన్ని కొనుగోలు చేస్తామంటూ వారిని సంప్రదించిన ముజీబ్ కోటి రూపాయాలకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ మేరకు రూ. 10 లక్షలను అడ్వాన్స్గా చెల్లించాడు.

మిగిలిన డబ్బులు ఇవ్వకుండా ముజీబ్ కాలయాపన చేస్తున్నారు. అదే సమయంలో రియల్ఏస్టేట్ బ్రోకర్ అబూబకర్ అతని సోదరుడు అబ్దుల్లా ఆ భూమిని రూ. కోటి రూపాయాలకు కొనుగోలు చేస్తామని రైతులను సంప్రదించారు.
ముజీబ్ ఇచ్చిన రూ. 10 లక్షల అడ్వాన్స్ను తిరిగి అతనికే చెల్లిస్తామని కూడ వారు రైతులను ఒప్పించారు. అయితే ఈ విషయంలో తనకు సహయం చేస్తాడని రాచకొండ ఎఆర్ హెడ్క్వార్టర్స్ అడిషనల్ డిసిపి పులిందర్రెడ్డి సహయాన్ని కోరారు అబూబకర్ సోదరులు.
అయితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోకుండా ఉండేందుకుగాను అగ్రిమెంట్లో తన కూతరు ఐశ్వర్యరెడ్డి పేరును చేర్చాలని పులిందర్ సూచించాడు. అందుకు అబూబకర్ అంగీకరించారు.రైతులకు రూ.20 లక్షలు చెల్లించి అగ్రిమెంట్లో తన కూతురు ఐశ్వర్య పేరు రాయించుకొన్నాడు.
అయితే మిగిలిన డబ్బులను చెల్లించలేక అబూబకర్ సోదరులు రైతుల నుండి తప్పించుకు తిరిగారు. దీంతో రైతులు ఈ భూమిని గంగాధర్రెడ్డి, రవీందర్రెడ్డిలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. రూ. 1.10 కోట్లకు ఈ భూమిని విక్రయించేందుకు వారు ఒప్పందాన్ని కుదుర్చుకొన్నారు.
అంతేకాదు గతంలో ఈ భూమిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన ముజీబ్ ,అబూబకర్ సోదరులు చెల్లించిన అడ్వాన్స్ను తిరిగి ఇచ్చేందుకు కూడ గంగాధర్రెడ్డి, రవీందర్రెడ్డిలు ముందుకు వచ్చారు. ముజీబ్ ఇచ్చిన అడ్వాన్స్ రూ.10లక్షలకు అదనంగా మరో రూ.5 లక్షలను కలిపి, అబూబకర్ సోదరులు చెల్లించిన రూ.20 లక్షలకు అదనంగా మరో రూ.10 లక్షల కలిపి చెల్లించారు.
రంగంలోకి దిగిన అడిషనల్ డిసిపి పులిందర్రెడ్డి
ఈ విషయం తెలిసిన అడిషనల్ డిసిపి పులిందర్రెడ్డి రంగంలోకి దిగారు. తనకు తెలియకుండానే అగ్రిమెంట్ను రద్దు చేసుకోవడంపై అబూబకర్ సోదరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిమెంట్ తిరిగివ్వకపోతే రూ.75 లక్షల వచ్చేవని రాయదుర్గం పోలీస్స్టేషన్లో జూలై 25న, ఫిర్యాదు చేశారు. అబూబకర్ ఫిర్యాదు చేసిన మరునాడే అబూబకర్ను రాయదుర్గం పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి రూ. 60లక్షల విలువైన ఐదు చెక్కులపై సంతకాలు, తెల్లకాగితాలపై సంతకాలు చేయించారు. అంతేకాదు రూ,. 40వేల నగదును కూడ తీసుకొన్నారు.
ఈ విషయమై శనివారం నాడు హైద్రాబాద్ సీపీ సందీప్శాండిల్యకు అబూబకర్ ఫిర్యాదు చేశాడు. పులిందర్రెడ్డితో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేయాలని సీపీ ఆదేశించారు. బాధితుడు పోలీస్స్టేషన్కు వచ్చిన సమయంలో సీసీటీవి పుటేజీని స్వాధీనం చేసుకొన్నారు. మాదాపూర్ ఏసీపీ రమణకుమార్ను విచారణాధికారిగా నియమించారు.












Click it and Unblock the Notifications