టిక్కెట్ వార్: బిజెపి ఎమ్మెల్యేపై దాడి!, దానం వర్సెస్ విష్ణువర్ధన్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో తమ నేతకు టికెట్ ఇప్పించలేదని ఆరోపిస్తూ కొందరు కార్యకర్తలు ఉప్పల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారు పైన గురువారం దాడికి పాల్పడ్డారు. అసమ్మతి వర్గానికి చెందిన కొందరు స్థానికులు ఉప్పల్ క్రాస్ రోడ్డు సమీపంలో ప్రభాకర్ కారును అడ్డుకున్నారు.
కారు అద్దాలను ధ్వంసం చేశారు. టిక్కెట్ పైన ఎమ్మెల్యే ప్రభాకర్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ వారు వినలేదు. వారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, ఆ అసంతృప్త నేత సుదర్శన్ గౌడ్గా తెలుస్తోంది. తనకు చర్లపల్లి డివిజన్ టిక్కెట్ ఇవ్వలేదని అతను అసంతృప్తికి లోనయ్యారు.
ఈ విషయంలో తనపై దాడి జరిగిందని ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి నేపథ్యంలో ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
విష్ణు వర్సెస్ దానం
సోమాజిగూడ డివిజన్ టిక్కెట్ పైన కాంగ్రెస్ పార్టీలో గురువారం మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురు కూడా తమ అనుచరులకు టిక్కెట్ ఇప్పించుకోవాలని పట్టుబట్టారు.
ఈ స్థానం నుంచి తాను ప్రతిపాదించిన అభ్యర్థినే బరిలోకి దించాలని విష్ణు పట్టుబట్టగా, ఖైరతాబాదు మాజీ ఎమ్మెల్యేగా తనకూ అభ్యర్థిని నిర్ణయించడంలో హక్కుందంటూ దానం వాదించారు. ఈ క్రమంలో విష్ణు ప్రతిపాదించిన అభ్యర్థిని దానం తిరస్కరించగా, దానం ప్రతిపాదించిన అభ్యర్థిని విష్ణు తిరస్కరించారు.
దీంతో అభ్యర్థి ఖరారు విషయంలో ఇరువురు నేతలు పట్టుదలతో ఉండటంతో ఆ పార్టీ సీనియర్లు ఎవరికీ సర్దిచెప్పలేక తలలు పట్టుకున్నారు. ఈ విషయం ఢిల్లీకి చేరింది. దిగ్విజయ్ సింగ్... విష్ణుకు ఫోన్ చేసి సర్ది చెప్పడంతో సమస్య కొలిక్కి వచ్చింది. విష్ణు అనుచరుడికి పార్టీలో అవకాశమిస్తామని డిగ్గీ చెప్పగా, విష్ణు సానుకూలంగా స్పందించారు.
బిజెపికి ప్రేంసింగ్ రాజీనామా
బిజెపి మాజీ ఎమ్మెల్యే ప్రేం సింగ్ రాథోడ్ పార్టీకి రాజీనామా చేసారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీకి చెందిన కార్యకర్తలకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చినందుకు నిరసనగా ఆయన గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఇటీవల బిజెపిలో చేరిన వారికి టిక్కెట్లు ఇచ్చారని ప్రేంసింగ్ రాథోడ్ మండిపడ్డారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ నచ్చచెప్పినా ఆయన ససేమీరా అన్నారు.
కేసులో జోక్యం చేసుకోం: హైకోర్టు
ఆస్తి పన్ను చెల్లించనందుకు నామినేషన్ తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆస్తి పన్ను బకాయి రూ.536 చెల్లించలేదని కార్వాన్ డివిజన్ నుంచి పోటీ చేసిన తన భార్య నామినేషన్ను తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంపై రవీందర్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
తన భార్య పాన్కార్డు జిరాక్స్ సమర్పించినప్పటికి, వివరాలు పేర్కొనకపోవడాన్ని సాకుగా నామినేషన్ తిరస్కరించారని పిటిషనర్ తెలిపారు. ఈ నెల 18నే ఆస్తిపన్ను బకాయిలు చెల్లించినట్లు రవీందర్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు.
నామినేషన్తో పాటు సమర్పించే అఫిడవిట్లో అభ్యర్థి పాన్కార్డు, ఆదాయం పన్ను వివరాలను కాలం 3, 5లలో పూరించాలనే సంగతి తెలియదని వాదించారు. కానీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.