రేవంత్కు తెలియకుండా జగన్ ఇంటి వద్ద కూల్చివేత: ఒక్క ఫోన్ కాల్: కమిషనర్పై బదిలీ వేటు
Revanth Reddy: హైదరాబాద్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన లోటస్ పాండ్ నివాసం వద్ద నిర్మాణాల తొలగింపు వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ హేమంత్పై బదిలీ వేటు పడింది.
వైఎస్ జగన్కు హైదరాబాద్ బంజారాహిల్స్ లోటస్ పాండ్ వద్ద భవనం ఉన్న విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్నందున ఈ ఇంట్లో చాలాకాలం నుంచి నివాసం ఉండట్లేదు జగన్. గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కొత్తగా ఇంటిని నిర్మించుకుని, అక్కడే నివసిస్తోన్నారు.

ప్రస్తుతం లోటస్ పాండ్ ఇంట్లో ఏపీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల, జగన్ తల్లి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఉంటోన్నారు. గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రధాన కార్యాలయంగా కూడా కొనసాగింది ఈ ఇల్లు. ఆ పార్టీ అక్కడే ఆవిర్భవించింది కూడా. ఆ తరువాత షర్మిల ఏపీ రాజకీయాల్లో తలమునకలయ్యారు. అయినప్పటికీ- ఆమె అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తోన్నారు.
శనివారం ఈ ఇంటి ముందు ఉన్న కొన్ని నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. రోడ్డును ఆక్రమించుకుని ఈ నిర్మాణాలు ఉన్నాయని, వాటికి అనుమతి లేదనేది ఆరోపణ. భద్రత సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన అవుట్ పోస్ట్, కొంత ప్రహరీగోడను అధికారులు తొలగించారు.
ఈ తొలగింపు వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందిప్పుడు. ఆక్రమణలను తొలగించాలంటూ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదని చెబుతున్నారు. నిర్మాణాల తొలగింపులో మౌఖిక ఆదేశాలను అందుకోవడం వల్లే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని కూల్చివేసినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం ఈ విషయం తెలియదని చెబుతున్నారు. జగన్ ఇంటి వద్ద ఆక్రమణలను తొలగించాలంటూ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు మౌఖిక ఆదేశాలను జారీ చేయడం వల్లే జీహెచ్ఎంసీ అధికారులు కార్యాచరణ చేపట్టారని అంటున్నారు.
ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆక్రమణలను తొలగించి 24 గంటలు కూడా గడవక ముందే కమిషనర్ బదిలీ కావడం చర్చనీయాంశమౌతోంది. ప్రస్తుతం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications