సైన్యంలోకి రాచబాట: వరంగల్ సైనిక పాఠశాలకు పచ్చజెండా
రాష్ట్రానికి సంబంధించిన సైనిక పాఠశాలను వరంగల్ అర్బన్ జిల్లాకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడి విద్యార్థులకు మహర్దశ పట్టనుంది.
వరంగల్: రక్షణ దళాల్లో చేరేందుకు తొలిమెట్టు లాంటి విద్యా సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమమవుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కోరుకొండలో కొలువుదీరిన సైనిక పాఠశాలకు ఇక వెళ్లనవసరం లేదు. రాష్ట్రానికి సంబంధించిన సైనిక పాఠశాలను వరంగల్ అర్బన్ జిల్లాకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడి విద్యార్థులకు మహర్దశ పట్టనుంది.
హసన్పర్తి మండలం మడిపల్లి పరిధిలోని ప్రభుత్వ భూముల్లో సైనిక పాఠశాలను ఏర్పాటుచేసేందుకు రక్షణ శాఖ సుముఖత వ్యక్తంచేసింది. సీబీఎస్ఈ విధానంలో సైనిక పాఠశాలలో బోధన తరగతులు ఉంటాయి. ఈ పాఠశాలలో చదివేవారికి సైనికుల మాదిరిగానే శిక్షణ కార్యక్రమాలను నేర్పిస్తారు.

రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత రాష్ట్రంలో కూడా సైనిక పాఠశాల ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీనికి అనుగుణంగానే సైనిక పాఠశాల ఏర్పాటుచేయడానికి గల అవకాశాలను సైనిక, రెవెన్యూ అధికారులు మడిపల్లి శివారులోని ప్రభుత్వ భూములను కొద్ది నెలల కిత్రం పరిశీలించారు.
ఆరో తరగతిలో ప్రవేశాలు.:
జిల్లాలో సైనిక పాఠశాల ఏర్పాటైతే 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. 10 నుంచి 11 సంవత్సరాల బాలలకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ విధానంలో విద్యాబోధన సాగుతుంది. ప్రవేశపరీక్షను ఏటా నిర్వహిస్తారు. నవంబరు 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.
అన్ని సైనిక పాఠశాలలకు కలిపి దేశవ్యాప్తంగా జనవరి 10వ తేదీన పరీక్ష జరుగుతుంది. గరిష్ఠంగా 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఇస్తారు. ఏ రాష్ట్రంలో ఈ విద్యా సంస్థ ఉంటుందో ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 67 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. మిగతా 33 శాతం సీట్లను ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారికి కేటాయిస్తారు.












Click it and Unblock the Notifications