50లక్షలను వైట్గా మార్చిస్తామని.. డబ్బుతో ఎస్కేప్ అయ్యారు!
ఐటీ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో.. సికింద్రాబాద్కు చెందిన బంగారు వ్యాపారులు దినేష్, దీపక్లు తమ దగ్గర ఉన్న 50 లక్షలతో కొంతమంది దళారులను ఆశ్రయించారు.
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఓవైపు సామాన్యులను ఇక్కట్లకు గురిచేస్తుంటే.. మరోవైపు నల్లకుబేరుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. భారీ మొత్తంలో నల్లధనం పోగేసినవాళ్లు, ఐటీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నవాళ్లు.. హవాలా ద్వారా దాన్ని వైట్ గా మార్చేందుకు మార్గాలు వెతికే పనిలో పడ్డారు. తాజాగా హైదరాబాద్లోను ఇలాంటి ఘటన వెలుగుచూసింది.
ఐటీ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో.. సికింద్రాబాద్కు చెందిన బంగారు వ్యాపారులు దినేష్, దీపక్లు తమ దగ్గర ఉన్న 50 లక్షలతో కొంతమంది దళారులను ఆశ్రయించారు. హరి అనే ఓ పరిచయస్తుడి ద్వారా కమిషన్ కింద పాత నోట్లను మార్చే వ్యక్తిని కలుసుకున్నారు. ఇదే క్రమంలో శ్రీనివాస్, చైతన్య అనే ఇద్దరు వ్యక్తులను సంప్రదించారు. రవీందర్ రెడ్డి అనే మరో వ్యక్తిని వారు పరిచయం చేశారు.
అత్తాపూర్ ఐసీఐసీఐ బ్యాంక్ వద్దకు వచ్చి కలిస్తే.. తమకు తెలిసిన బ్యాంకు మేనేజర్ తో మాట్లాడి పాత నోట్లను మార్చి ఇస్తామని రవీందర్ రెడ్డి నమ్మబలికాడు. దీంతో దినేష్, దీపక్లు ఇద్దరు అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 18 దగ్గర ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ దగ్గరకు చేరుకున్నారు. తీరా అక్కడికి చేరుకున్నాక.. అంత డబ్బును మార్చడం కష్టమంటూ వేరే ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాడు రవీందర్ రెడ్డి.
అక్కడికి చేరుకోవడమే ఆలస్యం.. ఇద్దరు వ్యక్తులు పోలీసులమంటూ దినేష్, దీపక్లపై ప్రశ్నించడం మొదలుపెట్టారు. డబ్బు గురించి ప్రశ్నించి.. వారిద్దరు తేరుకునే లోపు డబ్బుతో అక్కడినుంచి పారిపోయారు. అప్పటిదాకా తమతో ఉన్న రవీందర్ రెడ్డి కూడా అక్కడినుంచి ఉడాయించడంతో... చివరికి పోలీసులను ఆశ్రయించక తప్పలేదు.