హైదరాబాద్కు భారీ వర్షాలు: ఇలా చేయాలంటూ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు
హైదరాబాద్: భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వారాంతం నుంచి హైదరాబాద్కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అంతర్గత విభాగాలతోపాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎక్కడికక్కడ అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో భోజన సమావేశాలు ఏర్పాటు చేసుకొని, వారి సేవలకు అభినందనలు తెలుపుతూనే, నగర పారిశుద్ధ్యన్ని మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన దిశా నిర్దేశం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్. ప్రజల నుంచి వస్తున్న స్పందనను తెలుసుకున్నారు. సమస్యలపై వార్డు కార్యాలయాన్ని సందర్శించిన పలువురితో తాము స్వయంగా ఫోన్లో మాట్లాడామన్న అధికారులు.. వార్డు కార్యాలయం వ్యవస్థ పట్ల పౌరులు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
వార్డుల పరిధిలో ఉన్న కాలనీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు, ఇతర సంఘాల సహకారంతో కూడా వార్డు కార్యాలయ వ్యవస్థకు మరింత ప్రచారం కల్పించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి సూచించారు.
మూడు రోజులపాటు భారీ వర్షం
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి ఆవర్తనం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లిన కొద్ది నైరుతి దిశ వైపునకు వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాని కారణంగా తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తూర్పు, పశ్చిమ ద్రోణి సుమారుగా 15 డిగ్రీల అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టం నుంచి 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె.నాగరత్న తెలిపారు.
ఇక , ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు వర్షం నేపథ్యంలో ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications