నమ్మించి మోసం, నాన్నను క్షమించలేను: తండ్రి దాడిలో గాయపడిన మాధవి ఏమన్నారంటే?
హైదరాబాద్: ఇటీవల నగరంలోని ఎర్రగడ్డ వద్ద తండ్రి చేతిలో తీవ్రంగా గాయపడిన మాధవి(22) కోలుకోవడంతో వైద్యులు బుధవారం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించారు.
మారుతీరావు ఎఫెక్ట్: 'ఎంత చెప్పినా వినలేదు, అందుకే కసాయిలా మారా!': మనోహరాచారి పశ్చాత్తాపం
ఇష్టంలేని పెళ్లి చేసుకుందని తండ్రి కత్తితో దాడి..
తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె మాధవి, అల్లుడు సందీప్పై సెప్టెంబర్ 19వ తేదీన హైదరాబాద్లోని ఎర్రగడ్డ వద్ద అమ్మాయి తండ్రి మనోహరాచారి పట్టపగలే కత్తితో దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దాడి అనంతరం మనోహరాచారి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనలో మాధవి ఎడమ చేయి సగానికి పైగా తెగిపోయింది. మెడ, చెవికి బలమైన గాయాలయ్యాయి. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళం తెగిపోయింది. మాధవి భర్త సందీప్కు కూడా ముఖం, చేయిపై గాయాలయ్యాయి.
కోలుకున్న మాధవి...
మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో అప్పట్లో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్త స్రావమై ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాధవికి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. 7-8 గంటలపాటు శస్త్ర చికిత్స చేసి తెగిన రక్త నాళాలను, అవయవాలను అతికించారు. పూర్తిగా కోలుకోవడంతో బుధవారం ఇంటికి పంపారు. ఎడమ దవడ భాగం సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు ఈ సందర్భంగా వెల్లడించారు.
నాన్నను క్షమించలేను
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాననే కోపంతోనే నాన్న తనపై దాడి చేశాడని తెలిపింది. ‘పశ్చాత్తాప పడినా సరే నాన్నను క్షమించలేను. మరో అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నా తండ్రికి చట్టపరంగా శిక్ష పడాల్సిందే' అని మాధవి తెలిపింది. ఫోన్ చేసి పిలిచి మరీ అతి పాశవికంగా దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
నమ్మించి మోసం చేశారు.. అందుకే..
ఆప్యాయత చూపిస్తున్నట్లు నటిస్తూనే చంపాలని చూశాడని కన్నీటి పర్యంతమైంది. ఇకపై తాను పుట్టింటికి వెళ్లనని, భర్తతోనే ఉంటానని తేల్చి చెప్పింది. ‘సందీప్పై పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాతే ఆయన్ను పెళ్లి చేసుకోవాలని భావించాను. ఇదే విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పాను. అయితే, వారు అంగీకరించకపోవడం వల్లే ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకున్నాం. దాడి తర్వాత చాలా అవస్థ పడ్డాను. నాలాంటి పరిస్థితి మరే ప్రేమికురాలు ఎదుర్కోకూడదు. దాడి చేసిన వారెవరైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే' అని మాధవ స్పష్టం చేసింది.
రెసెప్షన్ చేస్తామని కూడా చెప్పారు..
‘పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి రావాలని మనోహరాచారి ఆహ్వానించాడు. రిసెప్షన్ చేస్తామని చెప్పాడు. కొత్త బట్టలు కొనిస్తానని నమ్మించాడు. తీరా వచ్చిన తర్వాత దాడికి పాల్పడ్డాడు. ప్రాణాపాయస్థితిలో వచ్చిన నా భార్యను యశోద ఆస్పత్రి ఆదుకుంది. వైద్యఖర్చులను భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది' అని మాధవి భర్త సందీప్ వెల్లడించాడు. తమకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, ప్రస్తుతం మనోహారాచారి జైలులోనే ఉన్నాడు.