కేసీఆర్ దొంగ దీక్ష సమాచారం అక్కడుంది: జైపాల్ రెడ్డి సంచలనం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ పచ్చి అవకాశవాది అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.
అవసరం ఉంటే తప్ప కేసీఆర్ ఎవరినీ పొగడరని పాయింట్ లాగారు. 2019లో తెరాస నేతలు గ్రామాల్లో తిరగలేరని చెప్పారు. కెసిఆర్ తన రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. కేబినెట్లో తెలంగాణ ద్రోహులే ఎక్కువగా ఉన్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీదే తప్ప అందులో కేసీఆర్ పాత్ర లేదన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ దొంగ దీక్షలు చేశారని దుయ్యబట్టారు. దీక్షకు సంబంధించిన సమాచారం అంతా నిమ్స్లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు గకేసీఆర్ శనిలా దాపురుంచారని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన పైన అందరిలోను అసంతృప్తి నెలకొని ఉందని చెప్పారు. ఎన్నికలలో తమ పార్టీ ఓటమికి తమ పార్టీ నేతల వ్యాఖ్యలే కారణమని చెప్పారు.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ నియంత పాలన చేస్తున్నారన్నారు. కేబినెట్లో తెలంగాణ ద్రోహులు ఉన్నారన్నారు. బంగారు తెలంగాణ పేరుతో భారీగా దోపిడీ జరుగుతోందని భట్టి విక్రమార్క అన్నారు. 99 శాతం హామీలు పూర్తి చేశామని కేసీఆర్ నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేసిన సాగునీటి పనులు ఇంకా పూర్తి చేయలేదన్నారు. రీడిజైన్ పేరుతో, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల టెండర్లు వేస్తున్నారని, దాదాపు లక్ష కోట్ల రూపాయల దోపిడీకి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ప్రసార మాధ్యమాలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని, లేదంటే ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు వస్తాయన్నారు. మీడియా యాజమాన్యాలు భయపడవద్దన్నారు.
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రజలకు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కేసీఆర్పై విమర్శల వర్షం కురిపించారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేసీఆర్ ఉత్సవాలను జరిపిస్తున్నారని, ఓవైపు రాష్ట్రంలో పేద ప్రజలు చనిపోతుంటే మరోవైపు వేడుకలు చేసుకుంటున్నారని, ఇది చాలా సిగ్గుచేటు అన్నారు.
ఈ రెండేళ్ల పాలనలో ఒక్క కేసీఆర్ కుటుంబసభ్యులు మాత్రమే లాభపడ్డారని, రాష్ట్రంలో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వడదెబ్బ, నిరుద్యోగ సమస్యలతో ఎంతో మంది పౌరులు మృతిచెందారని, ఇలాంటి సమయంలో వేడుకలు చేసుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని, ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.