మోడీ తాత్కాలిక ప్రధాని, ఆయన తర్వాత రూ.2000 నోటు అంతే: జీవన్ రెడ్డి సంచలనం
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జీవన్ రెడ్డి రూ.2000 నోటు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పదవీ కాలం ముగిసిన తర్వాత రెండువేల రూపాయల నోటు చెల్లదన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జీవన్ రెడ్డి రూ.2000 నోటు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పదవీ కాలం ముగిసిన తర్వాత రెండువేల రూపాయల నోటు చెల్లదన్నారు. కొత్త నోట్ల పైన మోడీ ప్రసంగం రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు. మోడీ తాత్కాలిక ప్రధాని మాత్రమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అనాలోచిత నిర్ణయం: పొంగులేటి
పెద్ద నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయమని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. పేదలంతా రోడ్ల పైకి వచ్చారని, రైతులు, చిన్న వ్యాపారులు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని పొంగులేటి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో కొంత ఉపశమనం ఉంటుందని ప్రజలు భావించారన్నారు.
కానీ అది నిరాశనే మిగిల్చిందన్నారు. ప్రధాని మోడీకి వినతి పత్రంతో కేసీఆర్ సరిపెట్టారని ఎద్దేవా చేశారు. బడాబాబులు తీసుకున్న రూ.14 లక్షల కోట్ల విషయాన్ని గాలికి వదిలేసి సామాన్యుల మీద పడటం న్యాయం కాదన్నారు. యుద్ధ ప్రాతిపదికన చిల్లర సమస్యను పరిష్కరించాలన్నారు.