చేతులెత్తేసిన కమలనాథన్ కమిటీ: మోడీ కోర్టుకు ఉద్యోగుల విభజన
హైదరాబాద్: జిల్లా, జోనల్, మల్టీజోనల్ పోస్టుల్లోని ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ ప్రధాని నరేంద్ర మోడీ కోర్టుకు చేరనుంది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల కేటాయింపులకే తాము పరిమితం తప్ప, కిందిస్థాయి ఉద్యోగుల కేటాయింపులపై తమకు వెసులుబాటు లేదని కమలనాథన్ కమిటీ తేల్చి చెప్పింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
జిల్లా, జోనల్, మల్టీజోనల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఓపెన్ కేటగరీ కింద మొదటి నుంచి కూడా 20, 30, 40 శాతం చొప్పున స్థానికేతరులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని టీఎన్జీఓ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాదాపు 40 వేల మంది వరకూ ఉంటారని అంచనా.
స్థానికత ప్రాతిపదికపై ఇప్పుడు వీరందరినీ వెనక్కు పంపివేయాలని టీఎన్జీవో నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్పై కమలనాథన్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న సిబ్బంది, వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్చనావర్మను శుక్రవారం ఢిల్లీలో కలిశారు.
కాగా, జిల్లా, జోనల్, మల్టీజోనల్ పోస్టుల్లోని ఉద్యోగుల విభజన తమ చేతుల్లో లేదని, దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అర్చనావర్మ స్పష్టం చేశారు. దీంతో టీఎన్జీఓ నేతలు దేవీప్రసాద్, వి. శ్రీనివాస్ గౌడ్, కారం రవీందర్ రెడ్డి, మామిడి చంద్రశేఖర్ గౌడ్, మామిడి నారాయణ, తదితరుల బృందం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలుసుకుని తమ డిమాండ్లను చెప్పింది
తెలంగాణ ఉద్యోగుల వాదన సబబేనని, వాస్తవానికి ఈ అంశాన్ని ఇప్పటికే పరిశీలిస్తున్నామని, సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని, ప్రధాని నరేంద్రమోడీతో చర్చిస్తాని, ఏమైనప్పటికీ తెలంగాణ ఉద్యోగుల డిమాండ్ సహేతుకమైనదేనని ఆయన అన్నారు.
‘ఆప్షన్'పై తెలంగాణకు కేటాయించిన దాదాపు 5 వేల మంది ఆంధ్రా ఉద్యోగులను కూడా పంపివేయాలని, నాలుగో తరగతి ఉద్యోగులను ఎక్కడివారిని అక్కడే నియమించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పరిశీలిస్తామని కమలనాథన్ కమిటీ సభ్యురాలు అర్చనావర్మ చెప్పారు. ఉద్యోగుల విభజనపై కేంద్రం వైఖరి సరిగా లేదని, అవసరమైతే మరో ఉద్యమం చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.