చెడు అలవాట్లు వద్దు, పరస్పరం గౌరవించుకోండి: కెసిఆర్
సంగారెడ్డి: పరస్పరం గౌరవించుకోవాలని, చెడు అలవాట్లు మానుకోవాలని, అందరం కలిసికట్టుగా నర్సన్నపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రజలు ఉద్బోధ చేశారు. మెదక్ ఎర్రవెల్లి గ్రామంలో పర్యటన అనంతరం గురువారంనాడు ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న మరో గ్రామం నర్సన్నపేటకు వెళ్లారు.
నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూం ఇండ్లకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గ్రామస్తులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా రోజు ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు.

ఊరు ఊరంతా ఒక పద్దతిగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. గ్రామంలో 100 శాతం డ్రిప్ ఇరిగేషన్ పూర్తి చేయడానికి బోర్లు వేయడానికి కావాల్సిన ప్రణాళికను అధికారులు తయారు చేస్తారని, దేవుడి ఆశీస్సులు, అధికారుల అండదండలు మనకు ఉంటాయని ఆయన అన్నారు. నర్సన్నపేటలో 200 ఇండ్ల మంజూరయ్యాయని చెప్పారు.
గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 23.64కోట్లు కేటాయించామని, ఇండ్ల నిర్మాణానికి మీనాక్షి అనే సంస్థ ఇప్పటికే టెండర్ను దక్కించుకోని అగ్రిమెంట్ సైతం పూర్తి చేసుకుందని, మెటీరియల్ను కూడా తెచ్చుకుని నిర్మాణ పనులను చేపట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
గ్రామ వాతావరణానికి అనుకూలంగా ఇంటి చుట్టూ ఖాళీ స్థలం, పశువులు, కోళ్ల పెంపకానికి ఏర్పాట్లు, వ్యవసాయ పనిముట్ల భద్రత కోసం అవసరమైన వసతులతో పాటు నల్లా కనెక్షన్, గోబర్గ్యాస్ ప్లాంటు, సోలార్ లైటు సౌకర్యం ఏర్పాటు చేస్తారని చెప్పారు.

ఇంటి చుట్టూ, వీధులకు ఇరువైపులా మొక్కలు పెంచుతారని, రోడ్లు, ఇతర సౌకర్యాలన్ని ముందుగా ఏర్పాటు చేసిన లేఅవుట్ ప్రకారమే నిర్మిస్తారని చెప్పారు. అప్పటి వరకు ప్రజలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో ఉండాల్సి ఉంటుందని అన్నారు.
సింగిల్ బెడ్రూం ఉన్న ఇళ్లకు కూడా డబుల్ బెడ్రూం సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. ఒక్కో ఇంటికి రూ. 5.04లక్షలను ఖర్చు చేయనున్నారని అన్నారు. ఇంకా గ్రామంలో గిడ్డంగులు, కమ్యూనిటీ హాల్, గ్రంథాలయం, బ్యాంకు, వెజ్, నాన్వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications