పెట్టుబడులే లక్ష్యం: అమెరికాకు మంత్రి కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె తారక రామారావు మే రెండో వారంలో అమెరికాలో పర్యటించనున్నారు. 15 రోజుల పాటు జరిగే పర్యటనలో మంత్రి కెటి రామారావు అమెరికాలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తారు.
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అమెరికాలోని పలు కంపెనీలు, సంస్థలు, పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఐటీ, పారిశ్రామిక పాలసీలను అమెరికా కంపెనీలకు వివరించనున్నారు.
అమెరికా పర్యటనలో ప్రవాస తెలంగాణ ప్రజలను కూడా కలిసి భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను బుధవారం మంత్రి కెటి రామారావు ట్విట్టర్లో వెల్లడించారు.
మిషన్ కాకతీయకు క్రెడాయ్ మరో 25 లక్షల విరాళం
మిషన్ కాకతీయకు మొదటి నుంచి మద్దతు ప్రకటిస్తున్న క్రెడాయ్ (ది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) మరో రూ.25 లక్షల విరాళాన్ని బుధవారం నాడు అందించింది. ఇప్పటికే రూ.50 లక్షలు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు క్రెడాయ్ అందించిన విషయం తెలిసిందే.
ఆ సమయంలోనే మరో రూ.50 లక్షల వరకు విరాళాన్ని అందిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు రూ.25 లక్షల చెక్కును మిషన్ కాకతీయకు విరాళంగా అందించారు. త్వరలోనే మరో రూ.25 లక్షలు కూడా అందించనున్నట్లు క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు.