సహజీవనం చేసి, పిల్లలు పుట్టాక ముఖం చాటేశాడు: యువతి ధర్నా
హైదరాబాద్: ఆమెను ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఆమెతో సహజీవనం చేశాడు. దీంతో ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఆమెకు ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది.
బంజారాహిల్స్ పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం... ఫిలింనగర్ ప్రాంతానికి చెందిన సుజాతను భగత్సింగ్కాలనీకి చెందిన అశోక్ కొన్నేళ్ల క్రితం ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో కలిసి సహజీవనం చేసి ఇద్దరు కుమారులకు తండ్రి అయ్యాడు.
పలుమార్లు వివాహం చేసుకోవాలని నిలదీసినా ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చాడు. ఇప్పుడు తప్పించుకు తిరుగుతుండటంతో బాధితురాలు శుక్రవారం భగత్సింగ్కాలనీలోని అశోక్ ఇంటి ఎదుట బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అశోక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.