కుటుంబాన్ని తిట్టాడని మిత్రుడిని చంపేశాడు (ఫొటో)
హైదరాబాద్: తన కుటుంబాన్ని దూషించాడని ఓ వ్యక్తి మద్యం మత్తులో స్నేహితుడినే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సికింద్రాబాదులోని మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ శేఖర్గౌడ్ కథనం ప్రకారం - నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్కు చెందిన శ్యామూల్(39) తన తల్లితో కలిసి మల్కాజిగిరి సర్కిల్ పీవీఎన్ కాలనీ కౌసిక్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు.

అయితే, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్కు చెందిన చంద్రశేఖర్తో అతడికి 25 ఏళ్లుగా స్నేహం ఉంది. సోమవారం రాత్రి శ్యామూల్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చంద్రశేఖర్, అతడి స్నేహితుడు ప్రభాకర్ ముగ్గురు కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం ప్రభాకర్ వెళ్లిపోయాడు.
ఆ తర్వాత చంద్రశేఖర్ కుటుంబసభ్యులను శ్యామూల్ దూషించడం మొదలుపెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. చంద్రశేఖర్ ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కత్తిపీట తీసుకొచ్చి శ్యామూల్ గొంతు కోసి, కారంపొడి చల్లి దారుణంగా హత్య చేశాడు. అనంతరం స్నేహితుడు ప్రభాకర్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.

ప్రభాకర్ పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అపార్ట్మెంట్కు వెళ్లి చూడగా శ్యామూల్ మృతిచెంది ఉన్నాడు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కాగా, శ్యామూల్ తాగుడుకు బానిస కావడంతో అతడి భార్య 2002లో ఆత్మహత్య చేసుకుంది. అలాగే, చంద్రశేఖర్ భార్య గతంలోనే అతడిని వదిలేసి బిడ్డతోసహా వెళ్లిపోయింది.












Click it and Unblock the Notifications