భద్రాద్రిలో భక్తుల ఇక్కట్లు .. రాములోరి కల్యాణానికొచ్చే భక్తులకు లేని షెల్టర్
హైదరాబాద్ : రాములోరి క్షేత్రంలో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సరైన విడిది సౌకర్యం లేదు. దీంతో భక్తులు చెట్లు, పుట్టల పక్కన కునుకుతీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏటా ఆలయం, ఇతర పనుల కోసం కోట్లు కేటాయిస్తారు. కానీ అవి కార్యరూపం దాల్చడం లేదు. మళ్లీ శ్రీరామనవమి వస్తోంది. ఈ నెల 14న రాములోరి కల్యాణం. కానీ భద్రాచల క్షేత్రంలో షెల్టర్ మాట ఆ దేవ దేవుడికే తెలియడం లేదు.
రాములోరి కల్యాణానికి భక్తుల బారులు
భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. సాధారణ సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరతారు. ఇక సీతరాముల కల్యాణం సమయంలో అయితే ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తోంటారు. ఏటా రాములోరి కల్యాణానికి వచ్చే జనం సంఖ్య పెరుగుతోంది. కానీ వసతులు మాత్రం అంతంతమాత్రమే. వారు ఉండేందుకు విడిది లేని దుస్థితి నెలకొంది.

ప్రకటనలకే పరిమితమైన రూ.100 కోట్లు
రాములోరి కల్యాణం కనులారా వీక్షించి తరిద్దామనుకొని .. రాష్ట్రం నుంచే గాక పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అసలే ఎండకాలం కావడంతో భక్తుల షెల్టర్ తప్పనిసరి అవుతోంది. ఓ వైపు ఎండలు, మరోవైపు దాహంతో భక్తులు అలమటిస్తున్నారు. వారికి విడిది కేంద్రం ఉంటే .. తాగేందుకు మంచినీరు, తిని, కాసేపు సేదతీరొచ్చు. కానీ అలాంటివేమి లేకపోవడంతో భక్తుల ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. ఏటా ప్రభుత్వం భద్రాచలం ఆలయానికి నిధులు కేటాయిస్తోంది. గత బడ్జెట్ లో రూ.100 కోట్లు ప్రకటించింది. దీంతో అవసరమైన పనులు పూర్తవుతాయని భావించారు. కానీ ఆ నిధులు విడుదలకాకపోవడంతో .. షెల్టర్ల సహా ఇతర ముఖ్యమైన పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
కాటేజీలు, అతిథి గృహల్లో 600 గదులు
భద్రచాలంలో కాటేజీల్లో 162 గదులు ఉన్నాయి. ప్రైవేట్ లాడ్జీలు, అతిథి గృహలు కలిపి 600 గదులు ఉన్నాయి. వీటిలో సాధారణ భక్తులకు విడిది దొరకుతుందా అంటే అదీ లేదు. దాదాపు 90 శాతం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వీఐపీలు, దాతలకే కేటాయిస్తున్నారు. ఇటు టీటీడీ రూ.5 కోట్లతో 32 గదులు, 3 డార్మిటరీ హాళల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటి పనులు పూర్తయితే కాస్తలో కాస్త భక్తులకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. మరోవైపు నిర్వహణ సవ్యంగా లేక, ఇతర సమస్యలతో ఆలయానికి చెందిన కొన్ని గదులను అద్దెకు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

రాములోరి కల్యాణ సమయంలో 2 లక్షల చదరపు అడుగుల్లో చలువ పందిళ్లు వేస్తున్నారు. అయినా పోటెత్తే భక్తులకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో సమీపంలోని చెట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీరామ నవమి సందర్భంగా ఎండలు .. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చలి ఉంటుంది. ఈ రెండు పండుగ రోజుల్లో భద్రాచలానికి భక్తులు పోటెత్తుతారు. ఈ సమయంలో సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications