పుష్కరాల్లో అన్యమత ప్రచారం, వరదనీటితో గోదావరిలో నీరు పుష్కలం
హైదరాబాద్: సెలవులు కావడంతో గోదావరి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో పుష్కరాల్లో కూడా అన్యమత ప్రచారం ఊపందుకుంది. భద్రాచలంలో పుష్కరఘాట్లో అన్యమత ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని బజరంగ్దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు.
అతను ఒక మతానికి చెందిన కరపత్రాన్ని తన పేరిట ముద్రించి పుష్కరాలకు వచ్చిన భక్తులకు పంపిణీ చేస్తున్నాడు. దీంతో అతడిని పట్టుకున్న బజరంగ్దళ్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరదనీటితో గోదావరిలో నీరు పుష్కలం
మొన్నటి వరకు గోదావరి పుష్కరాల్లో స్నానం చేసేందుకు వచ్చిన భక్తులు నదిలో నీళ్లు తీవ్ర ఇక్కట్లు పాలైన సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది.
దీంతో ఎట్టి పరిస్ధితుల్లోనూ బారికేడ్లను దాటి ముందుకు వెళ్లరాదని పుష్కరాలకు వచ్చిన భక్తులకు పోలీసులు, అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు కూడా గోదావరి నీటిమట్టం భారీగా పెరిగింది.
దీంతో అధికారులు దగ్గరుండి మరీ పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. ఇది ఇలా ఉంటే పుష్కరాల్లో భాగంగా తొమ్మిదో రోజైన బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం-భద్రాచలం మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
దీంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సెలవులు లేకున్నా భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో భద్రాచలం వెళ్లే దారులు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.