ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: సీసీఎంబీని కోరిన సీఎం కేసీఆర్, పాల్గొన్న జగన్
న్యూఢిల్లీ: కరోనావైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమీక్షలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, పంజాబ్, హర్యానా, గుజరాత్, సిక్కిం, మిజోరాం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుూ.. కొవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోందని అన్నారు.
మార్చి 1న అమెరికాలో 75 కేసులు నమోదవగా.. నేటికి ఆ సంఖ్య 14వేలకు చేరిందని ప్రధాని చెప్పారు. ఎండ తీవ్రతకు కరోనావైరస్ వ్యాపించదనడంపై ఆలోచించాల్సి ఉందన్నారు. ఎండలు తీవ్రంగా ఉండే సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాల్లో కూడా కరోనావైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోందని మోడీ గుర్తు చేశారు.
కరోనా నివారణ కోసం రాష్ట్రాల్లో చేపట్టిన చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ఆరా తీశారు. పలు కీలక సూచనలు కూడా చేశారు. ఈ సమీక్షలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు రెండు రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ మంత్రులు ఈటెల రాజేందర్, ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. స్క్రీనింగ్ పరీక్షల కోసం హైదరాబాద్లోని సీసీఎంబీనీ తాము వినియోగించుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. ఈ క్రమంలో కేంద్రం దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ప్రధానికి వివరించారు.
Today, via video conferencing, had an extensive interaction with Chief Ministers of various states to discuss ongoing efforts towards tackling COVID-19 menace. Discussed ways to curtail the spread and ensure our citizens are healthy. #IndiaFightsCorona https://t.co/vrduvarxiU
— Narendra Modi (@narendramodi) March 20, 2020
Recommended Video
కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 244 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు భారతీయులు కాగా, మరొకరు ఇటలీకి చెందిన వ్యక్తి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్త చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.