కొండారెడ్డిపల్లి ఉబ్బితబ్బిబ్బు: ప్రకాశ్రాజ్ చమత్కారం, సమస్యలు ఏకరవు
మహబూబ్ నగర్: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామస్తులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మంగళవారం నాడు గ్రామంలో కలెక్టర్ శ్రీదేవి, ప్రకాష్ రాజ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్లు పర్యటించారు. ప్రకాశ్ రాజ్ రాకతో జన సందడి కన్పించింది.
మౌలిక వసతుల కొరతతో పాటు గ్రామంలో నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకు దారి చూపాలని గ్రామస్థులు ప్రకాశ్ రాజ్ను, కలెక్టర్ను కోరారు. ఇన్నాళ్లు ఎన్ని నిధులు వచ్చినా గ్రామం అభివృద్ధి అంతంత మాత్రమే అన్నారు. గ్రామంలో వందలాది మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పారు.

వాటితో పాటు పలు సమస్యలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో... తాను ప్రకాశ్ రాజ్ను కాదని చమత్కరించారు. అయితే, మేం సినిమాల్లో చూశామని, మీరే ప్రకాశ్ రాజ్ అని పిల్లలు సమాధానం చెప్పారు.
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ... జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని, అది ఏవిధంగానైనా సంపాదించవచ్చన్నారు. ప్రతి ఒక్కరికి అందరూ బతకాలనే ఆలోచన ముఖ్యమన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను అందరం కూర్చుని మాట్లాడి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేద్దామన్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మారుమూల గ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవడం తనకు ఆనందం కలుగజేస్తోందన్నారు. గ్రామాల్లో శక్తి దాగి ఉందని, ఒకప్పుడు అన్ని వనరులు ఇక్కడే ఉండేవని, ప్రస్తుతం అవి కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ మనం గ్రామాలకు బలం చేకూర్చాలన్నారు. నేను దత్తత తీసుకున్న గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతానని చెప్పారు.
వ్యవసాయం, విద్య, పారిశుద్ధ్యం, తాగునీటితో పాటు అన్ని సమస్యలను తీర్చుకుందామన్నారు. నాకు పదిమంది యువకులను అప్పగించాలని గ్రామస్థులకు చెప్పారు. ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, వాటిని ఎక్కడ కేటాయించాలి, ఇంకా ఏం అవసరమో రిపోర్ట్ తయారు చేయాలన్నారు. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే సేంధ్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications