పరువు పోతోంది!: డ్రగ్స్ కేసులో కేసీఆర్ను టార్గెట్ చేసిన వర్మ
ముంబై/హైదరాబాద్: వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ డ్రగ్స్ వ్యవహారంలో జరుగుతున్న దర్యాప్తుపై మరోసారి విమర్శలు గుప్పించారు. నిన్నటి వరకు సిట్ లక్ష్యంగా విమర్శలు చేసిన రాంగోపాల్ వర్మ తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
అకున్ 'బాహుబలి3', డ్రగ్స్ కేసుపై వర్మ సంచలనం: చంద్రవదన్ స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణ పరువుపోయింది..
డ్రగ్స్ స్కాంతో తెలంగాణ పరువు పోయిందని వర్మ వ్యాఖ్యానించారు. ఇంతవరకు తెలంగాణ సీఎం కేసీఆర్ సమర్థుడైన రాజకీయనాయకుడని ముంబై వాసులు పేర్కొనే వారని, సిట్ విచారణ కారణంగా హైదరాబాదుతో పాటు తెలంగాణ బ్రాండ్ విలువను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు.
Recommended Video
కేసీఆర్కు మంచి పేరుంది..
పంజాబ్ స్కూల్స్లో జరుగుతున్నట్లుగానే తెలంగాణ, హైదరాబాద్ స్కూళ్లలో డ్రగ్స్ వ్యవహారం జరుగుతోందని ముంబై వాసులు భావిస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ కేసు విచారిస్తున్న సిట్.. హైదరాబాద్, టీఆర్ఎస్, కేసీఆర్కున్న మంచి పేరును చెడగొట్టేలా వ్యవహరించవద్దని వర్మ సూచించారు.
తెలంగాణ ప్రతిష్టకే భంగం
తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులను విచారిస్తున్న తీరుతో తెలంగాణా ప్రతిష్టకే భంగం కలిగిందని పేర్కొన్నాడు. సిట్ విచారణతో పంజాబ్ కంటే తెలంగాణ అధ్వానమైన స్థితిలో ఉందని ముంబై వాసులంటున్నారని వర్మ పేర్కొన్నాడు. బాహుబలి సినిమాతో తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని రాజమౌళి అమాంతం పెంచితే... ఆ స్థాయిని బాహుబలి అకున్ సబర్వాల్ దేశంలో దిగజార్చారని వర్మ తెలిపాడు.
పంజాబ్ కంటే దారుణంగా...
సినీ పరిశ్రమనే అకున్ సబర్వాల్ టార్గెట్ చేసుకున్నారని వర్మ ఆరోపించారు. సినీ ప్రముఖులను విచారించడం వల్ల డ్రగ్స్ కేసులో ఏ విషయం కూడా బయటపడలేదని అన్నారు. దీని ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. పంజాబ్ కంటే కూడా తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉందని ముంబై ప్రజలు అనుకుంటున్నారని వర్మ వ్యాఖ్యానించారు.