మీరే చెప్పారు, కేసీఆర్ సుఖం కోసం రూ.1000 కోట్లు: రేవంత్ ఝలక్
ఈ మూడేళ్లలో తెరాస ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు కేవలం 1400 మాత్రమే నిర్మించారని, ఈ విషయాన్ని మీరే చెప్పారని టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఈ మూడేళ్లలో తెరాస ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు కేవలం 1400 మాత్రమే నిర్మించారని, ఈ విషయాన్ని మీరే చెప్పారని టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో పేద ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. గత మూడేళ్లుగా చేసిన కేటాయింపుల్లో కనీసం ముప్పై శాతం కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ఈ రాష్ట్రంలో బలహీనవర్గాలు యాభై శాతానికి పైగా ఉన్నారని, వారికి కేవలం రూ.1000 కోట్లు కేటాయిస్తే ఎలా అన్నారు.
మీ సుఖసౌఖ్యాల కోసం..
మీరు సుఖసౌఖ్యాలతో ఉండేందుకు, స్నానం చేసేందుకు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూం నిర్మించుకున్న కేసీఆర్ తన ఇంటి కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేశారని, అదే బలహీన వర్గాలకు అంతే మొత్తం ఖర్చు చేశారన్నారు.
కేసీఆర్కు ఒక్కడికే రూ.1000 కోట్లు
కేసీఆర్ ఒక్కడు సుఖంగా ఉండేందుకు రూ.1000 కోట్లు ఖర్చు చేశారని, 52 శాతం బలహీనవర్గాలకు అదే రూ.వెయ్యి కోట్లు కేటాయించడం దారుణం అన్నారు. ఇది పేదల బడ్జెట్ కాదని, పెట్టుబడిదారుల బడ్జెట్ అన్నారు.
మూడెకరాల భూమి మాటేమిటి?
దళిత, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఏదని ప్రశ్నించారు. రైతులకు రుణ విముక్తి కాలేదన్నారు. ఈ బడ్జెట్ బోగస్ బడ్జెట్ అన్నారు.
లాభం లేదంటూనే మోడీకి మద్దతు
బడ్జెట్లో బీసీ సబ్ ప్లాన్ ఊసేలేదని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆదాయం రాలేదంటూనే ప్రధాని మోడీ చర్యలను సమర్థించారని మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి నామమాత్రపు కేటాయింపులు చేశారన్నారు.