బంధువులు, రియల్టర్ల కోసమే: కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జనాభా ప్రాతిపదికన జరగడం లేదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. బంధువులు, రియల్టర్లకు లభ్ది చేకూర్చేందుకు జిల్లాల విభజన చేపట్టారని అందులో పేర్కొన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటులో పరిపాలనా సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. జిల్లాల ఏర్పాటు వెనుక రాజకీయ స్వార్ధం దాగి ఉందని దుయ్యబట్టారు. చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న వరంగల్-హన్ముకొండను వేరుచేయడం సరికాదని సూచించారు. ఒక్కో జిల్లాను ఒక్కో టీఆర్ఎస్ నేతకు రాసినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు: సీఎం కేసీఆర్
దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు మొదలైన వాటిపై మంగళవారం ఆయన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సౌకర్యానికి అనుగుణంగా కొత్త జిల్లాలు ఉండాలని అన్నారు. విభాగాలకు అనుగుణంగా అధికారుల సర్దుబాటు చేయాలన్నారు. కొత్త ఉద్యోగుల నియామకం జరగాలని సూచించారు. దసరా నుంచి కొత్త జిల్లాలతోపాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా ప్రారంభం కావాలన్నారు.
ముందుగా కొత్త మండలాలలను నిర్దారించాలని, తర్వాత కొత్త రెవెన్యూ డివిజన్ల కూర్పు చేయాలని తెలిపారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో మొదటి రోజు నుంచే రెవెన్యూ, పోలీసు శాఖలు పని ప్రారంభించాలన్నారు. మిగిలిన శాఖల కార్యాలయాలు అధికారుల నియామకం వీలైనంత త్వరగా చేపట్టాలని ఆదేశించారు.
ఏర్పడ్డ తొలిరోజే నుంచే రెవెన్యూ, పోలీసు శాఖ పనులు ప్రారంభం కావాలని సూచించారు. 75 మండలాల కోసం డిమాండ్లు వచ్చాయని అన్నారు. అయితే కొత్తగా ప్రతిపాదించిన మండలాల్లో జనాభా 75 వేలకుపైగా ఉండాలని అన్నారు. మూడంచెల్లో పరిపాలన విభాగాలు, అధికారుల నియామకం తదితర ప్రక్రియలను కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు.
మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై స్పందన, అధికారులు చేసిన కసరత్తు, నివేదిక ఆధారంగా అవసరమున్న మార్పులు చేసి తుది రూపం ఇవ్వాలని తెలిపారు. ప్రారంభ దశలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈ సమావేశం కొనసాగుతోంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఆయన కలెక్టర్లు, అధికారులతో మాట్లాడుతున్నారు. కొత్త జిల్లాల మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు జగదీష్రెడ్డి, మహేందర్రెడ్డితోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.