రోడ్డు ప్రమాదం: 'జరసం' నేత జోగు అంజయ్య కుమార్తె మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పెడ్డకందుకూరు దగ్గర చోటు చేసుకుంది.
జనగామ: రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పెడ్డకందుకూరు దగ్గర సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. జనగామ రచయితల సంఘం (జరసం) గౌరవాధ్యకక్షుడు, లింగాలఘనపురం మండలం వడ్డిచెర్ల గ్రామానికి చెందిన జోగు అంజయ్య కాజీపేట మండలం సోమిడిలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు.
ఆయనకు కుమార్తె, కుమారుడున్నారు. కుమార్తె జోగు అపర్ణ (17) హైదరాబాద్లోని నారాయణ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. మూడు రోజుల పాటు సెలువు రావడంతో జనగామలోని ఇంటికి వచ్చిన అపర్ణను తండ్రి అంజయ్య ద్విచక్ర వాహనంపై సోమవారం తిరిగి హాస్టల్లో చేర్పించేందుకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆలేరు మండలం పెద్దకందుకూరు వద్ద జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని భువనగిరి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అపర్ణ మృతి చెందింది. తీవ్ర గాయాలతో అంజయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యాదగిరి గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
వరంగల్: పాఠశాలలకు సెలవుదినం కావడంతో చేపలవేటకని వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని వీస్లక్ష్మిపురం శివారు బండిచంద్రు తండాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. తండాకు చెందిన దారవత్ వెంకన్న కుమారుడు నవీన్(13), శంకర్ కుమారుడు మోహన్(12) సోమవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో చేపల వేటకని స్థానిక కట్టుకాలువ వద్దకు వెళ్లారు.
కాలువలోకి దిగి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అక్కడిక్కడే మృతి చెందారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. వారి స్నేహితులను ఆరా తీయగా చేపలు పట్టేందుకు కట్టుకాలువకు వెళ్లారని తెలిసింది.
వెంటనే అక్కడి చేరుకొని కాలువలో వెతికించగా ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు బయటపడ్డాయి. ఉదయాన్నే ఆడుతూ పాడుతూ కనిపించిన పిల్లలు ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.