రాహుల్ గాంధీకి ఏబీవీపీ షాక్: రాజయ్య ఇంట్లో ముగ్గురు చనిపోతే రాలేదే'
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ భాగ్యనగరం చేరుకున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి హెచ్సియుకు వెళ్తున్న సమయంలో ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేతలు దానం నాగేందర్, షబ్బీర్ అలీ, జానా రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం హెచ్సియుకు బయలుదేరారు.
'రాజయ్య ఇంట్లో ముగ్గురు చనిపోతే రాలేదేం'
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రాక పైన బిజెపి, ఏబీవీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్క్రృతులైన మాజీ ఎంపీ రాజయ్య నివాసంలో ముగ్గురు చనిపోతే ఎందుకు రాలేదని బిజెపి తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు రావడం రాజకీయ కోణమేనని విమర్శించారు.
విశ్వవిద్యాలయంలో గతంలో కూడా 35 మందిని సస్పెండ్ చేశారని, అప్పుడు కూడా కేంద్రం దానికి కారణమని తాము భావించలేదన్నారు. అలాగే ఇప్పుడు అయిదుగురిని సస్పెండ్ చేశారన్నారు. యూకుబ్ మెమెన్ ఉరితో వివాదం మొదలైందన్నారు. ఫేస్బుక్లో మెమెన్కు అనుకూల కామెంట్లు పెట్టాడాన్ని ఏబీవీపీ నాయకులు ప్రశ్నిస్తే వారిని చితక్కొట్టారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి కోసం తెరాస ప్రయత్నిస్తోందన్నారు.