ఏటీఎం సెంటర్లోకి కట్లపాము: దరిదాపుల్లోకి కూడా వెళ్లని జనం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ వద్దనున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎంలోకి ఓ కట్లపాము చొరబడింది.
భద్రాద్రి: నోట్ల రద్దు కారణంగా.. దేశవ్యాప్తంగా సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి బారులు తీరి.. డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో.. సహనం కోల్పోయి ఘర్షణకు దిగడాలు, బ్యాంకు అద్దాలు పగలగొట్టాలు వంటి ఘటనలు జరగడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎం వద్ద ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఏటీఎంలో డబ్బులు ఉన్నప్పటికీ.. లోనికి వెళ్లడానికి మాత్రం ఎవరూ ధైర్యం చేయడంలేదు. కారణం.. ఏటీఎంలోకి ఓ కట్లపాము చొరబడడమే. మధ్యాహ్నాం పూట పాము ఏటీఎంలోకి చొరబడడంతో.. ఇక ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ఎవరూ సాహసం చేయలేదు.
అసలే నోట్లు దొరక్క జనాలంతా ఇబ్బందులు పడుతుంటే.. ఇలా పాములు సైతం ఏటీఎంల్లో దూరి జనం సహనాన్ని పరీక్షించినట్టవుతుంది. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ సరిగా లేకపోవడం కూడా.. పలు సందర్బాల్లో ఇలాంటి ఘటనలకు కారణమవుతుంది.