సీఎం కేసీఆర్ శైలే డిఫరెంట్: సర్పంచ్ ఎన్నిక పరోక్షం? అందుకోసం స్పెషల్ అసెంబ్లీ
హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న గ్రామ పంచాయతీల రూపురేఖలు మారనున్నాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని పటిష్ఠ పరిచేందుకు పూనుకుంటున్న సీఎం కేసీఆర్.. ఆ దిశగా మరొక అడుగు ముందుకేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పంచాయతీల్లో సర్పంచ్ల ఎన్నికలు ప్రత్యక్షంగా జరిగాయి. కానీ దాన్ని తిరగరాసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. దీని ప్రకారం రాష్ట్రంలో ఇక సర్పంచ్ పదవికి పరోక్ష ఎన్నిక జరగనున్నది.
ఒకవేళ పంచాయతీ సర్పంచ్ తప్పుచేస్తే ఇప్పటివరకు సంబంధిత జిల్లా కలెక్టర్.. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి తగు చర్యలు తీసుకుంటారు. కానీ ముసాయిదా చట్టం ప్రకారం తప్పు చేసిన సర్పంచ్లపై క్రమశిక్షణ చర్యలకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఇందులో ప్రభుత్వం పాత్ర ఉండదు.

ఆరు రోజుల్లో ఐదుసార్లు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
రిజర్వేషన్ రొటేషన్ను ఐదేళ్లకు కాక పదేళ్ల తర్వాత చేపట్టాలని నిర్ణయించారు. ఐదేళ్లకే మారడం వల్ల ఒకసారి ఎన్నికైన వారు మళ్లీ అవకాశం రాదనే భావనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అలా కాక బాధ్యతగా పనిచేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం గత ఆదివారం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ఆరు రోజుల్లో ఐదు సార్లు సుదీర్ఘంగా సమావేశమై చర్చించి ముసాయిదా రూపొందించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం మార్పుపై వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ శనివారం సీఎం కేసీఆర్ను కలిసి తన నివేదికను సమర్పించింది.

సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా మార్పులకు చాన్స్
పంచాయతీరాజ్ చట్టంపై ఇప్పటికే నిపుణుల కమిటీ ఒక ముసాయిదాను రూపొందించింది. దానిపైనే క్యాబినెట్ సబ్ కమిటీ మరింత కసరత్తు చేసింది. పంచాయతీ రాజ్ చట్టానికి సవరణలు రూపొందించేందుకు ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీకి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత వహించగా, సభ్యులుగా ఈటల రాజేందర్, హరీశ్రావు, కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఉన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసుల్లో కొన్ని అంశాలపై కమిటీ సభ్యులతో సీఎం కేసీఆర్ చర్చించారని తెలుస్తున్నది. దీని ప్రకారం సీఎం కేసీఆర్ మార్పులేమైనా చెబితే అనుగుణంగా సవరణలు చేస్తారు. ‘పల్లె ప్రగతి - గ్రామ స్వరాజ్యం' పేరిట రూపొందించిన ముసాయిదాను ఆమోదించేందుకు ఈ నెల మూడో వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు.

రెండు నెలలకోసారి గ్రామ సభ నిర్వహణ తప్పనిసరి
దీని ప్రకారం ఇక నుంచి గ్రామ పంచాయతీలకు జనాభాకు అనుగుణంగా వార్షిక బడ్జెట్లోనే నిధులు కేటాయింపులు చేస్తారు. గ్రామాల పరిధిలో మౌలిక వసతుల కల్పనపై పాలక వర్గాన్ని అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది. రెండు నెలలకోసారి జరిగే గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. 500 జనాభా ఉంటే 50 మంది, 10 వేల జనాభా దాటితే 400 మంది హాజరు కావాలి. కొత్తగా 4000 పంచాయతీలు ఏర్పాటు చేయనుండగా, వాటిలో 2000 తండాలు ఉన్నాయి. దీని ప్రకారం 300 జనాభా ఉన్న ప్రతి తండా పంచాయతీగా మారే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. గ్రామ పంచాయతీల్లో వివిధ వర్గాలకు చెందిన ముగ్గురు కో ఆప్షన్ సభ్యులను నియమిస్తారు. వారిలో ఒకరు ఎన్నారై ఉంటారు. కానీ కో - ఆప్షన్ సభ్యులకు ఓటింగ్ హక్కు ఉండదు. ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శి వద్ద ఉన్న కార్యనిర్వహణ అధికారాల్లోని కొన్ని ఇక సర్పంచికీ లభించబోతున్నాయి.

సర్పంచ్లకు ఇలా ఎగ్జిక్యూటివ్ పవర్స్
పంచాయతీల్లో ఏ సేవలను ఎన్ని రోజుల్లోగా చేయాలో నిర్దేశించే పౌరసేవల పట్టిక (సిటిజన్ ఛార్టర్) అమల్లోకి రానుంది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి నిర్ణీతవ్యవధి ఉంటుంది. వీధిదీపాలు, మరుగుదొడ్లు పొందేందుకూ వ్యవధిని చట్టంలో నిర్దేశించనున్నారు. దీంతో ప్రజలు వీటిని తమ హక్కులుగా పరిగణించి పంచాయతీల్లో ఆయా పనులను చేయించుకోవచ్చు. సర్పంచ్లకు కార్యనిర్వహణాధికారాలు కల్పించడంతోపాటు ప్రత్యేకంగా విధులు, బాధ్యతలు అప్పగించారు. ఇక లేఅవుట్లు, కొన్ని అంతస్తుల వరకు జిల్లా స్థాయిలో అనుమతులు ఇస్తారు. మండల స్థాయిలో మాత్రమే పరిమిత నిర్మణాలకు అనుమతినిస్తారు.

మూడుసార్లు గైర్హాజరైతే వార్డు సభ్యులపై అనర్హత
అనుమతి లేని లే అవుట్లు, ప్లాట్లకు రిజిస్ర్టేషన్ నిరాకరిస్తారు. సర్పంచ్లు, వార్డు సభ్యులకు సిట్టింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఇక పరిశ్రమల ఏర్పాటుకు పంచాయతీల అనుమతి అవసరం లేదు. చట్టాలు, నిబంధనలు అతిక్రమించే వారిపై జరిమానాలే విధిస్తారు. వార్డు సభ్యులు మూడు మార్లు సభలకు గైర్హారైతే అనర్హత వేటు పడేలా చూడటం తదితర అంశాలను చట్టంలో చేర్చినట్టు సమాచారం. సర్పంచ్ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించాలని ప్రతిపాదించినట్టు తతెలిసింది. వార్డు సభ్యులను నేరుగా ఎన్నుకుని, ఆ తరువాత సర్పంచ్లను ఎన్నుకునే పద్ధతికి ప్రవేశపెట్టాలని చట్టం ముసాయిదాలో పేర్కొన్నట్టు వినికిడి.












Click it and Unblock the Notifications