అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తాం: ఎస్సీ వర్గీకరణపై రేవంత్ రెడ్డి తాజా ప్రకటనలు
Supreme Court on SC, ST sub classification: ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో ఏర్పాటైన ఏడుమంది సభ్యుల ధర్మాసనం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల్లో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయడంపై దాఖలైన పిటీషన్లపై విచారించడానికి ఏడుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ విక్రాంత్ నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం దీనిపై తుది తీర్పు ఇచ్చింది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని స్పష్టం చేసింది. కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై 2004లో అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘకాలంగా పోరాటం సాగిస్తూ వస్తోన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.. ఈ తీర్పును కన్నీటితో స్వాగతించారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పడం తమ పోరాటానికి నిదర్శనమని అన్నారు.
వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేయడానికి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని రేవంత్రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి తాము వర్గీకరణను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో తాము అన్ని రాష్ట్రాల కంటే ముందుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారాయన.
తాము అధికారంలోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే అంటే.. 2023 డిసెంబర్ 23వ తేదీన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, అడ్వకేట్ జనరల్ను సుప్రీంకోర్టుకు పంపించామని, వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని రేవంత్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications