ఒట్టు.!అమ్మతోడు.!ఈ సారి తాడో పేడో తేల్చుకునే వస్తాం.!నేడు ఢిల్లీకి మంత్రుల బృందం.!
హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుతో సహా మంత్రుల బృందం నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి సాధించిందేమీ లేదనీ కాంగ్రెస్ పార్టీ, బీజేపి చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ మంత్రులు నడుం బిగిస్తున్నారు. మరొక్క సారి కేంద్ర పెద్దలతో తేల్చుకొని వస్తామని, ఈ సారి ఏదో ఒక సమాచారం తీసుకొనే రాష్ట్రంలో అడుగుపెడతామని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. గత నాలుగు రోజుల పర్యటనలో కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా వారితో సమావేశం కాలేక పోయామని వివరిస్తున్నారు మంత్రులు. అధికారులతో కలిసి వెళ్తున్న మంత్రులకు సీఎం చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం చేసి ఢిల్లీకి పంపిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రయోజనం లేని నాలుగు రోజుల సీఎం ఢిల్లీ పర్యటన.. నవ్వుకుంటున్న తెలంగాణ రైతాంగం..
ధాన్యం సేకరణపై కేంద్రంతో తేల్చుకునేందుకు మరొక్క ప్రయత్నంలో భాగంగా నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పయనవుతోంది.
ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు ఘాటుగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రుల ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలోనూ, తెలంగాణలోనూ రైతుల అంశం గత కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారింది.

ఆలస్యం చేస్తే మరింత నష్టం.. కేంద్రంతో మరొక్కసారి చర్చిద్దామంటున్న సీఎం..
ఇదిలా ఉండగా ఉత్కంఠగా సాగిన ప్రతికూల పరిస్ధితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా రైతుల కోసం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించి సంచలనానికి తెరతీసింది. ఈ సంఘటన జరిగిన తరువాత సీఎం చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో రాష్ట్రానికి తలనొప్పిగా మారిన ధాన్యం కొనుగోలు అంశంలో చర్చలు జరిపాలని భావించారు. వెంటనే అధికారులు, మంత్రుల బృందంతో హస్తినకు ప్రయాణమయ్యారు సీఎం చంద్రశేఖర్ రావు. ఢిల్లీలో నాలుగు రోజులు మకాం వేసినప్పటికీ ముఖ్యమంత్రి ఏ ఒక్క కేంద్ర మంత్రిని గానీ, ప్రధాన మంత్రిని గానీ సంప్రదించలేదు. నాలుగురోజుల పర్యటన బూడిదలో పోసిన పన్నీరులాగా ప్రయోజనం లేకుండాపోయింది. ఇక కేంద్రంతో ఏమీ తేల్చుకోకుండానే సీఎం చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి రావల్సిన పరిస్థితులు నెకొన్నాయి.

కేంద్రాన్ని నిలదీసేందుకు మరొక్క సారి ఢిల్లీకి మంత్రులు
కొంటారా..కొనరా.. చెప్పండి.. కేంద్రాన్ని నిలదీసేందుకు మరొక్క సారి ఢిల్లీకి మంత్రులు
కాగా నేడు మరోసారి తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చర్చలకు సిద్ధమైంది.కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకొనేందుకు తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం శుక్రవారం ఢిల్లీకి వెళ్తోంది. నవంబర్ 23న జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీలో ఏ విషయం తేలకపోవడంతో, ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధ్వర్యంలో మంత్రులు మహమూద్ అలీ, సీహెచ్ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్తో కూడిన బృందం నేడు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మరోసారి భేటీ.. తేల్చుడా.. నాన్చుడా
రైతులకు మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్లు ప్రధాన అంశాలుగా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్తో శుక్రవారం సాయంత్రం తెలంగాణ మంత్రులు, అధికారుల టీమ్ సమావేశం అవుతుంది. యాసంగిలో రైతులు ఎలాంటి పంటలు వేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, రాష్ట్ర రైతులకు వివరిస్తామని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేసారు. కొత్త సాగు చట్టాలపై కేంద్రం ఆలోచించి చివరికి ఉపసంహరించుకున్నందున రైతులకు సానుకూల నిర్ణయం వస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

రైతులముందు చులకన కావొద్దు.. తేల్చుకొని రావాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం..
ఇదిలా ఉండగా నాలుగు రోజులపాటు సీఎం చంద్రశేఖర్ రావు ఢిల్లీలో పర్యటించినా ఎటూ తేల్చుకోకపోవడం రాజకీయంగా వివాదాస్పదమవుతోంది. కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్లు, ఏ పంటలు వేస్తే ఎంతవరకు లాభదాయకం లాంటి అంశాలను కేంద్రంతో చర్చించి రైతులకు మంచి సమాచారాన్ని చద్రశేఖర్ రావు అందిస్తారని అందరూ భావించారు. ముఖ్యంగా తెలంగాణ రైతులు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పట్ల చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ సీఎం చంద్రశేఖర్ రావు ఢిల్లీ నుంచి ఎలాంటి సమాచారం తీసుకురాకపోవడంతో నిరుత్సాహానికి లోనైనట్టు తెలుస్తోంది. రైతుల కష్టాలను తెలుసుకున్న సీఎం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ మంత్రులు, అధికారుల బృందాన్ని నేటి సాయంత్రం మరొక్క సారి ఢిల్లీకి పంపిస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications