టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు?: జడ్జీ ముందుకు నిందితులు, ఆధారాలేవీ?, రిమాండ్ తిరస్కరణ
హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారం కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం రాత్రి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ముగ్గురికీ రిమాండ్ విధించాలని కోరారు. అయితే, రిమాండ్ కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని.. సరైన ఆధారాలు లేని కారణంగా న్యాయమూర్తి తిరస్కరించారు.
ఎలాంటి ఆధారాలు, ఎమౌంట్ కూడా లేకపోవడంతో రిమాండ్ తిరస్కరించారు. నిందితులకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు.

కాగా, బుధవారం రాత్రి హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్నగర్లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో పోలీసులు సోదాలు చేశారు. హైదరాబాద్ కు చెందిన నందకుమార్, ఏపీలోని అన్నమయ్య జిల్లా చిన్న మండెం మండలంలో శ్రీమంత్రరాజ పీఠం నిర్వహిస్తున్న సింహయాజీ, ఫరీదాబాద్ కు చెందిన రామచంద్రభారతిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని నిన్న రాత్రే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ క్రమంలో గురువారం సాయంత్రం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నిందితులను సరూర్నగర్లోని న్యాయమూర్తి నివాసానికి తీసుకొచ్చి జడ్జి ముందు హాజరుపర్చారు.
ఈ ముగ్గరు కూడా.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ ప్రలోభపెట్టారని పోలీసులు అభియోగాలు మోపారు. రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications