WEF 2025: సీఎం రేవంత్ రెండో రోజు షెడ్యూల్..ఆ కంపెనీ సీఈఓలతో భేటీ..!!
World Economic Forum 2025:రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తొలి రోజు ఆయన పాల్గొన్నారు. తొలి రోజున గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులతో సహా ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇక రెండవ రోజు జరిగే పలు కార్యక్రమాల్లో సమావేశాల్లో రేవంత్ రెడ్డి బృందం పాల్గొంటుంది.
స్విట్జర్లాండ్ లోని దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 55వ వార్షిక సదస్సు మూడు రోజుల పాటు జరుగుతోంది.ఈసారి సమావేశాల్లో 'ఇండస్ట్రీస్ ఇన్ ఇంటిలిజెంట్ ఏజ్' అనే థీమ్ ను వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎంచుకుంది. శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు,పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతోనే రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు,రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఆయా రంగాలు,పరిశ్రమలకు చెందిన నిపుణులు,పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేల మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ,పునరుత్పాదక ఇంధనం,పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ఉత్పత్తికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇంధన ఉత్పత్తితో పాటు హైదరాబాద్లో ఫోర్త్ సిటీ అభివృద్ధి, ఏఐ ఆధారిత ఐటీ సేవల విస్తరణ, అత్యాధునిక డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు సంప్రదింపులు జరుపుతున్నాయి.

ఈ నేపథ్యంలో దావోస్లో రెండో రోజున పలు కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి శ్రీధర్ బాబు,రాష్ట్ర అధికారులు సమావేశమవనున్నారు.అమెజాన్,యుని లివర్,స్కై రూట్ ఏరో స్పేస్,సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సారధ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు.

ప్రధానంగా ఐటీ,డేటా సెంటర్లు,క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు జరుపనుంది.ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకోనుంది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ. 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రానికి ఈసారి భారీ పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications