వైసీపీని ఓడించాలంటే మధ్యేమార్గం- టీడీపీతో పొత్తు ప్రకటన..!!
2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రకటించారు. ఇవ్వాళ ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు.
తిరుపతి: రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 16వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. పట్టభద్రులు-3, ఉపాధ్యాయులు- 2, స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకోనున్నారు ఓటర్లు. ఇప్పటికే అయిదు స్థానిక సంస్థల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పోలింగ్ సందర్భంగా తిరుపతిలో భారీగా బోగస్ ఓట్లు నమోదయ్యాయంటూ ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. నకిలీ ఓట్లు పెద్ద సంఖ్యలో పోల్ అయ్యాయంటూ తెలుగుదేశం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, భారతీయ జనతా పార్టీ చీఫ్ సోము వీర్రాజు, వామపక్ష నేతలు.. విమర్శించారు. కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ వారు డిమాండ్ చేశారు.

క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించినప్పుడు బోగస్ ఓటర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. నకిలీ గ్రాడ్యుయేట్ ఓటర్లను అధికార పార్టీ సృష్టించిందని మండిపడ్డారు. అనంతపురంలో ఇదే పరిస్థితి తలెత్తినట్లు విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారంటూ ధ్వజమెత్తారాయన.
ఇవ్వాళ తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిజానికి- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసన మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఈ తీర్మానం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉందని, అలాంటప్పుడు శాసన మండలిలో ఆధిపత్యం కోసం జగన్ దొడ్డిదారిన ప్రయత్నాలు సాగిస్తోన్నారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ముఖ్యమంత్రి ఒక ప్రహసనంగా తయారు చేశారంటూ రామకృష్ణ ఆరోపించారు. పెద్దల సభగా చెప్పుకొనే శాసనమండలికి ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో రీ పోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు, నగదు పంపిణీతో మండలి ఎన్నికల ప్రతిష్ట దిగజారిందని ఆరోపించారు.
2024 ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీని ఓడించడమే తమ లక్ష్యమని రామకృష్ణ అన్నారు. వైసీపీని ఉమ్మడి శతృవుగా భావిస్తోన్నామని, దీనికోసం ఎవ్వరితోనైనా కలిసి పని చేస్తామని తేల్చి చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications