చంద్రబాబును తనిఖీ చేస్తారా: జగన్ను ఎలా చూసుకున్నాం: టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. మాజీ సీఎం..జడ్ప్లస్ కేటిగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబును సాధారణ ప్రజల బస్సులో విమానం వద్దకు పంపిస్తారా అని ఆగ్రహించారు. నాటి ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర సమయంలో తాము భద్రత కల్పించామని గుర్తు చేసారు. ఇదే సమయంలో ఆయనకు పైలెట్ వాహనం తొలిగింపు పైన పోలీసులు వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు ప్రోటోకాల్ ప్రకారమే అన్ని రకాలుగా భద్రతా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసారు.
బాబును అవమానించారు..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విమానాశ్రయంలో అవమానించిందని టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. విశాఖ నగరంలో గాంధ్రీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్..వెలగపూ డి రామకృష్ణబాబు తమ అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ చంద్రబాబును అవమానిస్తున్నారంటూ ఆందోళన కొనసాగించారు. జడ్ ప్లస్ కేటిగిరీ భద్రత కలిగిన చంద్రబాబును సాధారన ప్రయాణీకుడి మాదిరిగా బస్సులో విమానం వద్దకు పంపటం..మెటల్ డిటెక్టర్తో తనిఖీలు చేయటం దారుణ మని ఆందోళన వ్యక్తం చేసారు. దీని పైన జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలు చంద్రబాబుకు యధాతధంగా భద్రత కొనసాగించాలని డిమాండ్ చేసారు.

ప్రోటోకాల్ ప్రకారమే చంద్రబాబుకు...
ఇదే సమయంలో ఏపీ పోలీసు ఉన్నతాధికారులు సైతం స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత పైన ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు.చంద్రబాబుకు భద్రత విషయంలో ఎటువంటి మార్పులు చేయలేదన్నారు. ప్రాటోకాల్ ప్రకారం ఆయన కాన్వాయ్లోని అడ్వాన్స్ పైలెట్ కారు మాత్రమే తొలిగించినట్లు వివరించారు. ఆయన రాకపోకల సమయంలో రోడ్డు క్లియరెన్స్ గతంలో ఎలా ఉందో ఇప్పుడూ అదే విధంగా ఉంటుందని స్పష్టం చేసారు. ప్రముఖల భద్రత విషయంలో ఎవరికీ అపోహలు అవసరం లేదని పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. అయితే, చంద్రబాబును విమానాశ్రయంలో తనిఖీ చేసారనే అంశం వెలుగులోకి వచ్చినప్పటి నుండీ కొంత మంది టీడీపీ నేతలు అనేక రకాలుగా ఆరోపణలు చేసారు. దీంతో..పోలీసులు తమ వివరణ ద్వారా వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసారు.












Click it and Unblock the Notifications