పిఎఫ్ఎల్ గణతంత్ర వేడుకలు
న్యూయార్క్: పీపుల్స్ ఫర్ లోక్సత్తా డెట్రాయిట్ చాప్టర్ టీమ్ ఆధ్వర్యంలో భారత 65వ గణతంత్ర వేడుకలను అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఘనంగా జరుపుకున్నారు. మైనస్ 4 డిగ్రీల ఉష్టోగ్రత ఉన్నప్పటికీ వేడుకలకు ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. వేడుకలో విఐపిలు చాలా మంది ఉన్నప్పటికీ చిన్నారులతోనే జాతీయ జెండాను ఆవిష్కరించడం విశేషం.
మిచిగాన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు అమెరికాలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న 30 మంది సభ్యులు హాజరయ్యారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన తర్వాత వారు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశాన్ని అవినీతి రహితంగా చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.
భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. వేడుకలను వెంకట్ దిడుగు, త్రివిక్రమ్ నిర్వహించారు. ఇది ఇలా ఉండగా పిఎఫ్ఎల్ డల్లాస్ చాప్టర్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపి)తో కలిసి సంయుక్త ఆధ్వర్యంలో థామస్ జెఫర్సన్ పార్క్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఢిల్లీ ప్రజల లాగానే దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా అవినీతి పట్ల చైతన్యవంతులు కావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని ఏఏపి గెలిచిన రెండు నియోజక వర్గాలను దత్తత తీసుకున్నట్లు వారు తెలిపారు. ఎన్నారైలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రజనీకాంత్ ఎరబెల్లి, ఇతర సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు.