బాబు పాదయాత్ర సాహసమే: చివరి యత్నం?

అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మంగళవారం సాయంత్రం బాబు పాదయాత్ర ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల వల్ల, ఆయన దూకుడు వల్ల, కరువు కాటకాల వల్ల 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెసు ప్రత్యామ్నాయంగా కనిపించింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెసుకు తెలుగుదేశం ప్రత్నామ్నాయంగా కనిపించలేదు. ఇందుకు ప్రధాన కారణం - వైయస్ రాజశేఖఱ రెడ్డి ప్రజాకర్షక పథకాలు, చంద్రబాబు విధానాల ప్రభావం. ప్రస్తుతం ప్రభుత్వం తీవ్ర సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, కాంగ్రెసు పరిస్థితి అంత సజావుగా లేకున్నా తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదు.
2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో పాటు జయప్రకాష్ నారాయణ లోకసత్తా కంటిలో నలుసులా మారితే, ఇప్పుడు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం మనుగడకే సవాల్గా మారింది. ఈ స్థితిలోనే తిరిగి పార్టీని ముందు వరుసలో నిలబెట్టడానికే చంద్రబాబు నాయుడు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర ద్వారా అప్పట్లో వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర కాంగ్రెసులో తిరుగులేని నాయకుడిగా ముందుకు వచ్చారు. కాంగ్రెసు గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు వైయస్ తన పాదయాత్ర ద్వారా సమాధానం చెప్పారు.
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు ఆ సమస్య లేదు. పైగా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీని విజయపథాన నడిపించాల్సిన బాధ్యత చంద్రబాబు ఒక్కడిపైనే ఉంది. కాంగ్రెసు పరిస్థితి అలా కాదు. తెలుగుదేశంపై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న కాంగ్రెసు నాయకులంతా విడివిడిగానే అయినా ఒకే ధ్యేయంతో పనిచేశారు. అది తెలుగుదేశం పార్టీని ఓడించడం. పాదయాత్ర వైయస్ను ముఖ్యమంత్రిని చేసింది. తెలుగుదేశం పార్టీ గెలిస్తే చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారు. అయితే, ఆ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు మీదే ఉంది. ఈ స్థితిలోనే చంద్రబాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టారని అనుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications