చిరంజీవి మెగాప్లాన్: బొత్స కౌంటర్ (ఫొటోలు)
హైదరాబాద్: భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెసుకు పెద్ద దిక్కుగా మారేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దాంతో కాస్తా దూకుడుగా కూడా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి దూకుడుకు కళ్లెం వేయడానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు చిరంజీవిని తప్పు పడుతూ ఆయన ప్రకటనలు చేస్తున్నారు. చిరంజీవికి మద్దతునిచ్చే వారిపై ఎదురుదాడి చేస్తున్నారు.
తన వర్గాన్ని ముందుకు తీసుకుని పోతూ, తాను ముందుకు రావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే విద్యుత్ చార్జీల తగ్గింపు, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ను తన గొప్పతనంగా చూపించుకునే వ్యూహానికి చిరంజీవి పదును పెట్టారు. చిరంజీవి ఎదిగితే తనకు ఎసరు వస్తుందన్న మరింత ముందుచూపుతో బొత్స ఇప్పటినుంచే పావులుకదుపుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో ఆధిపత్యపోరు కొత్త మలుపు తిరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెసు గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో ఉండాడనికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకుని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రి పదవి హోదాలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆధిక్యత ప్రదర్శించాలని చూస్తున్నారు.

చిరంజీవి మాత్రమే రాష్ట్ర కాంగ్రెసుకు దిక్కు అంటూ దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య సందు దొరికితే చెప్పేస్తున్నారు. కాంగ్రెసుకు చిరంజీవి ఒక్కరే ఆశాకిరణమని ఆయన అన్నారు. కాబోయే ముఖ్యమంత్రి చిరంజీవి అని చెప్పడానికి ఆయన ఏ మాత్రం వెనకాడడం లేదు. ప్రజారాజ్యం కాంగ్రెసు పార్టీలో విలీనమైన తర్వాత చిరంజీవి అండదండలతో ఆయనకు రాష్ట్ర మంత్రి పదవి దక్కింది.

చిరంజీవిని తెలంగాణ కాంగ్రెసు నాయకులు పెద్దగా ఇష్టపడడం లేదు. చిరంజీవా, ఆయనెవరు అంటూ కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు వ్యాఖ్యానించారు. ఆయనకు ఆ స్థాయి లేదని చెప్పడానికి కేశవరావు ఆ వ్యాఖ్య చేశారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

చిరంజీవి ముందుకు వచ్చే ప్రయత్నాలను మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తన గొప్పదనమేనని చిరంజీవి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన తప్పు పట్టారు.

చిరంజీవిని మొదట వెనకేసుకొచ్చిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉన్నారు. కాంగ్రెసులో ఆశాకిరణాలు చాలా ఉన్నాయని ఆయన సి. రామచంద్రయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న బొత్స చిరంజీవి వ్యూహాలను దెబ్బ తీసే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
భవిష్యత్తులో తానూ సీఎం రేసులో ఉండేందుకు చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలకు గండికొట్టేందుకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. చిరంజీవికి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ మంత్రి సి.రామచంద్రయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో ఆధిపత్య రాజకీయాలకు అద్దం పడుతున్నాయి కాంగ్రెస్లో ఏకైక ఆశాకిరణం చిరంజీవి ఒక్కరేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యకు వెంటనే బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్లో ఇంకా చాలామంది ఆశాకిరణాలున్నారని ఘాటుగా బదులిచ్చారు. ‘ఆయన దృష్టిలో చిరంజీవి ఒక్కరే కాంగ్రెస్కు ఆశాకిరణం కావచ్చు. కానీ కాంగ్రెస్లో చాలామంది ఆశాకిరణాలున్నారు. దానికేమీ లోటు లేద'ని రామచంద్రయ్యపై వ్యాఖ్యానించారు.
చిరంజీవి ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో అతి వేగంగా, చురుకుగా వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్తులో తనకే నష్టమన్న ముందుచూపుతోనే బొత్స ఆయనకు ముందుగానే ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. బొత్స మాత్రమే కాకుండా చిరంజీవి దూకుడుపై మరికొంత మంది సీనియర్లు కూడా విరుచుకుపడుతున్నారు.
తాజాగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చిరంజీవిపై విమర్శనాస్త్రాలు సంధించారు. చిరంజీవి ఎస్సీఎస్టీపై గొప్పలు చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పిసిసి మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు కూడా చిరంజీవిపై రుసరుసలాడుతున్నారు. కేంద్రమంత్రి అయిన చిరంజీవి ‘చిరంజీవా? ఎవరా చిరంజీవి' అని వ్యంగ్యాస్త్రం సంధించారు. చిరంజీవిని అడ్డుకునేందుకు కాంగ్రెసులోని ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని వారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications